Sunday, April 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఫార్మాస్యూటికల్‌ హబ్‌గా తెలంగాణ

ఫార్మాస్యూటికల్‌ హబ్‌గా తెలంగాణ

- Advertisement -

– కోవిడ్‌ సమయంలో ప్రపంచాన్ని ఆదుకున్న హైదరాబాద్‌
– నకిలీ ఔషధాలు, మత్తు మందుల దుర్వినియోగంపై కఠిన చర్యలు
– రెండున్నరేండ్లలో 50 వేలకుపైగా తనిఖీలు : వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
– గాంధీలో డీ-అడిక్షన్‌ కౌన్సెలింగ్‌, ఇంటోక్సికేషన్‌ సెంటర్ల ప్రారంభం
నవతెలంగాణ-సిటీబ్యూరో

తెలంగాణ దేశంలోనే ప్రముఖ ఫార్మాస్యూటికల్‌ హబ్‌గా ఎదిగిందని, కోవిడ్‌ సమయంలో ప్రపంచాన్ని హైదరాబాద్‌ ఆదుకున్న దని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డీ అడిక్షన్‌ కౌన్సెలింగ్‌ సెంటర్‌, ఇంటోక్సికేషన్‌ సెంటర్‌ను శనివారం మంత్రి ప్రారంభించారు. అనంతరం గాంధీ మెడికల్‌ కాలేజీ అల్యూమినీ ఆడిటోరియంలో ‘డ్రగ్స్‌ వినియోగం, వాటి వల్ల కలుగుతున్న అనర్థాలు’ అంశంపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి అవగాహనా కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ”డ్రగ్స్‌ కంట్రోల్‌, రెగ్యులేటరీ స్ట్రెంగ్తెనింగ్‌ డే అత్యంత ముఖ్యమైనదని, సురక్షితమైన, నాణ్యమైన ఔషధాల వినియోగాన్ని ప్రోత్సహించడం, మెడిసిన్‌ దుర్వినియోగాన్ని నివారించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అని తెలిపారు. రాష్ట్రంలో మెడిసిన్‌, వ్యాక్సిన్‌ తదితర తయారీ యూనిట్లు 1500, 80 టెస్టింగ్‌ సెంటర్లు, 50వేలకు పైగా మెడికల్‌ షాపులు ఉన్నాయని వివరించారు. తెలంగాణలో తయారయ్యే మందులు, వ్యాక్సిన్లు ప్రపంచ వ్యాప్తంగా వినియోగంలో ఉన్నాయని చెప్పారు. కోవిడ్‌ సమయంలో కీలక ఔషధాలు, వ్యాక్సిన్లు సరఫరా చేసి హైదరాబాద్‌ ప్రపంచాన్ని ఆదుకున్న దని గుర్తు చేశారు. హైదరాబాద్‌ను ప్రపంచం విశ్వసనీయ వైద్య సేవలందించే కేంద్రంగా, ఫార్మాహబ్‌గా గుర్తించిందని తెలిపారు. నకిలీ మందులు, నాసిరకం ఔషధాలు, మత్తు మందుల దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రెగ్యులర్‌ ఇన్‌స్పెక్షన్లు నిర్వహిస్తున్నామని, గడిచిన రెండున్నరేండ్లలో 50 వేలకుపైగా తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు. యువతలో డ్రగ్‌ దుర్వినియోగం పెరుగుతున్నదని, ఇది సామాజిక సమస్యగా కాకుండా ఆరోగ్య సమస్యగా చూడాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35 ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్స్‌లో డీ-అడిక్షన్‌ కౌన్సెలింగ్‌ సెంటర్లు, స్పెషల్‌ ఇంటోక్సికేషన్‌ కేర్‌ యూనిట్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. స్క్రీనింగ్‌, ట్రీట్మెంట్‌, కౌన్సెలింగ్‌, ఫాలోఅప్‌ సేవలందిస్తున్నామని చెప్పారు. ఎర్రగడ్డలోని మెంటల్‌ హెల్త్‌ ఇనిస్టిట్యూట్‌లో డీ-అడిక్షన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ప్రారంభించామని తెలిపారు. డ్రగ్‌ నేరాలపై కట్టుదిట్టమైన చర్యల కోసం ఈగల్‌ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. యువత మెడిసిన్‌ను మత్తు పదార్థాలుగా వాడుతోందనీ, దీన్ని అరికట్టడంలో, మందుల సరైన వినియోగంలో ఫార్మాసిస్టుల పాత్ర చాలా కీలకం అని, బాధ్యతాయుతంగా మందులు ఇవ్వడం ద్వారా దుర్వినియోగాన్ని తగ్గించొచ్చు అని సూచించారు. ‘యాంటీ మైక్రోబైల్‌ రెసిస్‌టెన్సీ’ అనేది ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆరోగ్య సమస్యగా మారుతోందన్నారు. క్యూఆర్‌ కోడ్‌ వెరిఫికేషన్‌, ఆన్‌లైన్‌ ఫార్మసీ మానిటరింగ్‌ ద్వారా పారదర్శకత పెంచుతున్నామని తెలిపారు. ‘ప్రివెన్షన్‌ ఈజ్‌ బెటర్‌ దెన్‌ క్యూర్‌’ అనే సూత్రంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -