దేశంలో సామాజిక న్యాయానికి మార్గదర్శకం
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో సామాజిక న్యాయానికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన ఒక మైల్ స్టోన్ అని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. కులగణనను చాలా తేలికగా తన అంచనాలను మించి సీఎం, నిపుణుల కమిటీ పూర్తి చేసిందని చెప్పారు. కేవలం స్ఫూర్తితోనే కాకుండా, సమర్థవంతంగా తెలంగాణ ప్రభుత్వం ఈ సర్వేను నిర్వహించిందని ప్రశంసించారు. ఈ విషయాన్ని కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం అర్థం చేసుకోలేదని ఫైర్ అయ్యారు. త్వరలో దేశవ్యాప్తంగా నిర్వహించబోయే కులగణనను ఈ విధానంలో నిర్వహించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ”కులగణన అంత తేలికైన అంశం కాదు. తెలంగాణలో కులగణనకు ప్రోత్సహించినప్పుడు… సీఎం రేవంత్ రెడ్డికి ఈ అంశం కష్టమని భావించా. సీఎం సామాజిక వర్గం కూడా అందుకు అంగీకరించకపోయి ఉండవచ్చు. అందువల్ల చాలా జాగ్రత్తగా కులగణన అంశాన్ని సమీక్షించా’ అని అన్నారు. గురువారం ఏఐసీసీ నూతన పార్టీ ఆఫీస్ ఇందిరా భవన్లో కాంగ్రెస్ ఎంపీలకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వేపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్య సభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీలు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకష్ణ, చామల, ఇతర ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ… తెలంగాణలో తలుపులు మూసిన పరిపాలన గదుల నుంచి కులగణన చేయలేదని చెప్పారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన లక్షలాది మంది తెలంగాణ ప్రజలు ఈ సర్వేలో పాల్గొనేందుకు తలుపులు తెరిచారన్నారు. ఆస్తులు, విద్యార్హతలు, సామాజిక వర్గం వంటి… మొత్తం 56 ప్రశ్నలతో కుటుంబంలోని ప్రతి వ్యక్తి సమాచారాన్ని సేకరించినట్టు చెప్పారు. కానీ విపక్షాలు మాత్రం సక్రమంగా కులగణన చేయలేదని విమర్శిస్తున్నాయని మండిపడ్డారు. అలాంటి వారందరీ కోసం మరోసారి అవకాశం కల్పిస్తామని, వారంతా ముందుకు రావాలని చురకలంటించారు.
21వ శతాబ్దపు పవర్ పుల్ డేటా తెలంగాణ సొంతం
1950, 60, 70వ దశకాల్లో పవర్ ఎక్కడి నుంచి వచ్చిందని ప్రపంచ దేశాలను ప్రశ్నిస్తే… ఆయిల్ అనే సమాధానం వచ్చేదని రాహుల్ అన్నారు. ఆ ఆయిల్నే ప్రజలు బ్లాక్ గోల్డ్గా పిలుస్తారన్నారు. ‘ఏ దేశమైతే ఆయిల్ను కలిగి ఉందో… గ్లోబల్గా ఆ దేశమే ఆధిపత్యాన్ని కలిగి ఉండేది. ఇదే ప్రశ్నను ఈ రోజుల్లో అమెరికా అధ్యక్షులు డ్రోనాల్డ్ ట్రంప్, ప్రముఖ వ్యాపార వేత్త బిల్గేట్స్ను అడిగితే… ఈ కాలం ఆధిపత్యం డేటా(సమాచారం) అని చెబుతారు. అలాంటి 21 వ శతాబ్దానికి కావాల్సిన సోషల్, ఎకనామిక్, పొలిటికల్, ఫైనాన్షియల్ డేటా తెలంగాణ ప్రభుత్వం సొంతం. ఈ డేటాతో గ్రామీణా, జిల్లా స్థాయిల్లో సామాజిక, ఆర్థిక, ఎడ్యూకేషన్, హెల్త్… ఇలా ఏ సెక్టార్ల్ లో అయినా అభివద్ధి ఫలాలు అందించవచ్చు.’ అని అన్నారు. ఇలాంటి టార్గెట్ డెవలప్మెంట్ అందించే అవకావం దేశంలోని ఇతర ఏ రాష్ట్రానికి లేదని గర్వంగా చెబుతున్నానన్నారు. ఇది ప్రస్తుత సమాజానికి కావాల్సిన సామాజిక, ఆర్థిక టూల్ అని చెప్పారు. అయితే సామాజిక, ఆర్థికం అంశంతో పాటు రాజకీయంగానూ దేశ ప్రజలకు మేలు చేసే ఈ సర్వేను బీజేపి ఎలాగు ఇష్టపడదని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ విద్యా, ఉద్యోగాల్లో, పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తోందన్నారు. కేవలం హిందూత్వం పేరుతో రాజకీయ విధ్వంసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ విషయం బీజేపీ వాళ్లకు, తమపై పోరాడుతున్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు తెలుసునన్నారు.
దేశాభివృద్ధికి ఏకైక మార్గం ఇంగ్లీష్
దేశ అభివృద్ధికి డబ్బు, భూమలు కాదని… ఇంగ్లీష్ ఎడ్యూకేషన్ ఒక్కటే ఏకైక మార్గమని రాహుల్ అన్నారు. ఈ విషయం తెలంగాణ కుల గణనలో స్పష్టంగా వెల్లడైందని చెప్పారు. ‘ఇంగ్లీష్ అత్యంత పవర్ పుల్. ఈ సర్వేకు ముందు భూములే విలువైనవని నేను భావించే వాణ్ని. కానీ ఇంగ్లీష్ ప్రాధాన్యమైన అంశంపై కుల గణన ఎక్స్పర్ట్స్ కమిటీ చెప్పినప్పుడు ఆశ్చర్యం కలిగింది. ప్రస్తుతం ప్రాంతీయ భాషలు, హిందీ ఉన్నప్పటికీ… ఇంగ్లీష్ అవసరం. అలా అని హిందీ, ప్రాంతీయ భాషలు అక్కర్లేదని తాను చెప్పడం లేదు’ అని క్లారిటీ ఇచ్చారు. హిందీ, తమిళ్, కన్నడ ఇలా ఏ ప్రాంతీయ భాష తీసుకున్నా… దాని తర్వాత ఇంగ్లీష్ను తప్పక బోధించాలన్నారు. ఈ విషయంలో ఏ బీజేపీ నేత దగ్గరకి పోయి అడిగినా… ఇంగ్లీష్ వద్దంటారు. అయితే ఏ స్కూల్, కాలేజీలో మీ పిల్లలు చదువుతున్నారు అని బీజేపీ నేతల్ని నిలదీయండి. ఆన్సర్ తప్పకుండా ఇంగ్లీష్ మీడియం అని వస్తుంది.’ అని చెప్పారు. మరి ఆ అవకాశాన్ని దేశంలోని వెనకబడిన వర్గాలైన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎందుకు ఇవ్వరని బీజేపి నేతల్ని ప్రశ్నించారు.
సీఎం మద్దతుతో పార్లమెంట్లో పోరాడుతా…
కుల గణన, ఓబీసీలకు రిజర్వేషన్లు తనకు, సీఎం రేవంత్ రెడ్డికి జాబ్ అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆ డేటాతో తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలనుకుంటున్నట్టు చెప్పారు. అలాగే దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని తాను నిరతంతరం ఆలోచిస్తున్నట్టు చెప్పారు. కానీ ఈ ఆలోచనను బీజేపీ అడ్డుకోవాలని చూస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా, ఉద్యోగాలు, లోకల్ బాడీ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్ల క్యాప్ను తొలగించేలా అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపిందన్నారు. కానీ దీన్ని బీజేపీ అడ్డుకుంటోందని ఆరోపించారు. ప్రస్తుతం సీఎం మద్దతు తో ఈ అంశంపై పార్లమెంట్ వేదికగా పోరాడడమే ప్రస్తుతం తన ముందు ఉన్న ముఖ్యమైన జాబ్ అని రాహుల్ స్పష్టం చేశారు. దేశంలోని ఓబీసీల ఆంకాంక్షలు, కోరికలు నెరవేర్చేందుకు బీజేపీ తమతో కలిసి రావాలని హితవు పలికారు. ఈ దిశలో 50 శాతం రిజర్వేషన్ల పరిమితి గోడను కూల్చాల్సిన అవసరం ఉందన్నారు.
బీజేపీ ఐడియాలజీ మరణిస్తుంది…
కేంద్రంలోని బీజేపీ సరైన పద్ధతిలో దేశవ్యాప్త కులగణన చేయబోదని రాహుల్ అన్నారు. దేశం లోని ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా వాస్తవ పరిస్థితులను చెప్పదన్నారు. ఒక వేళ వాస్తవాలను దేశం ముందే పెడితే… బీజేపీ ఐడియాలజీ పూర్తిగా మరణిస్తోందని విమర్శించారు. కానీ కాంగ్రెస్ పార్టీ దేశంలోని అన్ని వర్గాలకు బాధ్యతగా ఉంటుం దన్నారు. దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, మహిళలు ఇలా ఏ వర్గానికి సమస్య వచ్చినా… కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వారి వెంటే ఉంటుందన్నారు.
తెలంగాణ కులగణన ఒక మైల్ స్టోన్
- Advertisement -
- Advertisement -