– చైతన్య వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి
– ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి
– తెలుగు విశ్వవిద్యాలయ నూతన లోగో ఆవిష్కరణ
నవతెలంగాణ-కల్చరల్
తెలంగాణ సాంస్కృతిక చైతన్య వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా.జి.చిన్నారెడ్డి అన్నారు. హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళామందిరంలో బుధవారం సురవరం ప్రతాపరెడ్డి 129వ జయంతిని నిర్వహించారు. పొట్టి శ్రీరాములు పేరిట ఉన్న తెలుగు విశ్వవిద్యాలయం ‘సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం’గా మారినందున అధికారిక చిహ్నాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం చిన్నారెడ్డి మాట్లాడుతూ.. విశిష్ట చరిత్రకారుడు, ప్రజల జీవితంలో చైతన్యాన్ని నింపిన సంఘసంస్కర్త సురవరం ప్రతాపరెడ్డి పేరు తెలుగు విశ్వవిద్యాలయానికి అలంకారం అని అన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. వెయ్యి సంవత్సరాల ఆంధ్రుల చరిత్రను పరిశీలించి రచన చేసిన గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్న సాహితీమూర్తి ప్రతాపరెడ్డి అని గుర్తు చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం ఉన్నతికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు వచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆచార్య వెలుదండ నిత్యానందరావు మాట్లాడుతూ.. ప్రతాపరెడ్డి పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టడం ఆనందంగా ఉందని, విశ్వవిద్యాలయానికి తొలి ఉపాధ్యక్షునిగా తాను ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధ్యక్షులు ఆచార్య వి.బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ఉన్నత విద్యావ్యవస్థను సంస్కరించే విధంగా.. అందరికీ నాణ్యతతో కూడిన అందుబాటులో ఉండే విద్యను అందించాలనే లక్ష్యంతో ఉన్నత విద్యామండలి కృషి చేస్తోందని తెలిపారు. ఆ దిశగా తెలుగు విశ్వవిద్యాలయం పనిచేయాలని కోరారు. తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ.. తెలుగు జాతికి చైతన్యమూర్తిగా నిలిచిన గొప్ప వ్యక్తి ప్రతాపరెడ్డి అన్నారు. వారి రచనలు తన సాహిత్య జీవితంలో ఎంతో ప్రభావితం చేశాయన్నారు. డా.సంగిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సురవరం ప్రతాపరెడ్డి గురించి మాట్లాడాలంటే తెలంగాణ సోయి, చైతన్యం గురించి మాట్లాడినట్లేనని, సమాజాన్ని మేలుకొల్పే సామాజిక సంస్కర్తగా, తెలంగాణా వైతాళికునిగా నిలిచిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. సురవరం ప్రతాపరెడ్డి రచనలను తెలుగు విశ్వవిద్యాలయం ముద్రించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సురవరం ప్రతాపరెడ్డి పేరిట ప్రత్యేక పురస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఏటా వారి జయంతి రోజున ప్రదానం చేయాలన్నారు. సురవరం ప్రతాపరెడ్డి పేరిట రూ.10 కోట్ల నికర నిధులతో తెలుగు విశ్వవిద్యాలయం పీఠాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు ఈ సందర్భంగా సురవరం ప్రతాపరెడ్డి తనయులు కృష్ణవర్ధన్రెడ్డితోపాటు అతిథులను ఘనంగా సత్కరించారు. విస్తరణ సేవా విభాగం ఇన్చార్జి రింగు రామ్మూర్తి సమన్వయకర్తగా వ్యవహరించారు.న
తెలంగాణ సాంస్కృతిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES