Monday, September 22, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసింగరేణి ఉద్యోగులకు దసరా బోనస్ ప్రకటించిన ప్రభుత్వం

సింగరేణి ఉద్యోగులకు దసరా బోనస్ ప్రకటించిన ప్రభుత్వం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు భారీ శుభవార్త అందించింది. సంస్థకు వచ్చిన లాభాల్లో వాటాగా ప్రతి కార్మికుడికి రూ. 1,95,610 చొప్పున బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో సుమారు 71 వేల మంది కార్మికుల కుటుంబాల్లో పండగ శోభ ముందుగానే వచ్చినట్లయింది.

ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సోమవారం వెల్లడించారు. సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో అద్భుతమైన పనితీరు కనబరిచిందని ఆయన తెలిపారు. సంస్థ మొత్తం రూ. 6,394 కోట్లు ఆర్జించగా, అన్ని ఖర్చులు పోను నికరంగా రూ. 2,360 కోట్ల లాభం వచ్చిందని వివరించారు. ఈ లాభాల్లో 34 శాతం వాటాను కార్మికులకు బోనస్‌ రూపంలో పంపిణీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ బోనస్ పంపిణీ కోసం ప్రభుత్వం మొత్తంగా రూ. 819 కోట్లను విడుదల చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయోజనం సింగరేణిలోని శాశ్వత ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు కార్మికులకు కూడా వర్తిస్తుందని తెలిపారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ… “సింగరేణి సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఆత్మలాంటిది. ఇది కేవలం బొగ్గు గని మాత్రమే కాదు, వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఒక ఉద్యోగ గని” అని అన్నారు. భవిష్యత్తులో సింగరేణిని కేవలం బొగ్గుకే పరిమితం చేయకుండా, కీలక ఖనిజాల మైనింగ్ రంగంలోకి కూడా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. దసరా బోనస్‌తో పాటు దీపావళి సందర్భంగా కూడా కార్మికులకు మరో బోనస్ అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -