తెలంగాణా అభివృద్ధికి కీలకమైన విద్యావ్యవస్థకు పాలకుల నిర్లక్ష్యం అనబడే తుప్పు పట్టింది. గత పదేళ్లుగా పరిపాలన చేసిన కేసీఆర్ కానీ, ఏడాదిన్నరగా ఎన్నో మార్పులు చేస్తామని ఊరించిన రేవంత్ రెడ్డి గానీ నిర్ధిష్టమైన సంస్కరణలకు పూనుకోలేదు. ప్రభుత్వ పాఠశాల భవితవ్యం మార్చి సామాన్యుడికి విద్యాభారం కాకుండా కాపాడగలమనే నమ్మకాన్ని కలిగించకపోవడమే దీనికి ప్రధాన కారణం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న 30,022 పాఠశాలలు గాలికొదిలేసి, కేవలం ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ పేరుతో రెసిడెన్షియల్ పాఠశాలలు తెరవడం వలన పెద్ద ప్రయోజనం చేకూరలేదు.పైగా విద్యాప్రమాణాల్లో 31వ స్థానానికి దిగజారడం అప్పటి ప్రభుత్వం అనుసరించిన ముందు చూపులేని అనాలోచిత నిర్ణయాల ,తాత్కాలిక పటాటోపమే? వసతులు ఉన్న ప్రభుత్వ పాఠశాలలనే గురుకులాలుగా మార్చడానికి బదులు, ఏర్పరచిన గురుకులాలను దివాళా తీసిన ఇంజనీరింగ్ కళాశాలలు అద్దెకు తీసుకుని, తాత్కాలిక సిబ్బంది నియామకంతో నడపడం వలన వాటి ప్రామాణికత తగ్గింది.పైగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలే గురుకులాలకు తరలి వెళ్లేలా చేయడం వలన ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. లక్షలాది రూపాయలు వేతనాలిచ్చి నైపుణ్యం గల ఉపాధ్యాయులు ఉన్నా ప్రభుత్వ పాఠశాల నమోదు దెబ్బతిని మూతపడే స్థితికి దిగజార్చింది.ఇది ఇలా ఉంటే.. ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మారుస్తానని ప్రకటించి ఆమేరకు తెలంగాణా విద్యా కమిషన్ ఏర్పాటు చేసి,దాని నివేదిక ప్రభుత్వ బడుల సంస్కరణ దిశగా ఉన్నప్పటికీ 31,500 కోట ్లరూపాయల ఐదేళ్ల ప్రణాళిక(2025-2030) ఇచ్చారు. 2025-26బడ్జెట్లో నయాపైసా కేటాయించకుండా నివేదిక బుట్టదాఖలు చేశారు. ప్రభుత్వ బడుల సంస్కరణ పక్కన పెట్టి అచ్చు కేసీఆర్ మాదిరే 58 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు పేరుతో కొంతకాలం హడావిడి చేశారు. తీరాపాఠశాలల ప్రారంభం నాటికి ప్రభుత్వ పాఠశాల పరిస్థితి యదారాజా?తదాప్రజ? అన్న సామెత గా మారిపోయింది. ఇప్పటికే గతేడాది మూతపడ్డ ప్రభుత్వ బడులను కలుపుకుంటే, రెండువేల పైచిలుకు మూతపడడమో?లేక ఆదిశగా అంతిమ ఘడియల్లో ఉండటమే దీనికి నిదర్శనంగా కనిపిస్తున్నది.
ఇక ప్రభుత్వం నియమించిన తెలంగాణా విద్యా కమిషన్నే రాష్ట్రంలో ఉన్న 19వేల ప్రాథమిక పాఠశాలల్లో 13వేలపాఠశాలలు యాభై మంది పిల్లలు కంటే తక్కువ ఉన్నారని, ఇంకా ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల పరిస్థితి అందుకు భిన్నంగా లేదని పేర్కొంది. దీనికి సంఖ్య తక్కువ ఉన్న పాఠశాలల్ని మూసివేయడం పరిష్కారం కాదు. ఈ దశలో నిజంగా ప్రభుత్వ బడులు సంస్కరణ దిశగా అడుగు వేయా లనుకుంటే కనీసం విద్యా సంస్కరణలకు శ్రీకారం చుట్టాలి. కనీసంగానైనా తెలంగాణా విద్యా కమిషన్ సూచించిన ఏడాదికి వంద మండలాల విద్యా ప్రణాళిక ప్రకారం తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, తెలంగాణా ఫౌండేషన్ స్కూల్స్ ఏర్పాటు చేయాలి. కానీ ప్రయివేటుకు ఊతమిచ్చినట్టుగా నారాయణ, శ్రీచైతన్య లాంటి కార్పోరేట్ సంస్థలు వీధికో నాలుగు పాఠశాలలు తెరచుకోవడానికి అవకాశం కల్పించింది. దీనివల్ల సామాన్యునికి సరైన విద్య అందకపోగా విద్యవ్యాపారంగా మారడానికి దోహదం చేసినట్టయింది. విద్యాహక్కు చట్టం ప్రకారం నూతన విద్యార్థుల నమో దుకు కార్పోరేట్ సంస్థలు ప్రవేశపరీక్షలు పెట్టరాదని స్పష్టమైన నిబంధనలున్నప్పటికీ, బహిరంగంగా ప్రకటనలిచ్చి పేరుమార్చి టాలెంట్ టెస్టుల పెట్టడం పట్ల విద్యాశాఖ నోటీసులు కూడా ఇవ్వలేదు. ఆ వైపు సర్కార్ కూడా దృష్టి పెట్టలేదు. ఇలా టెస్టులు పెట్టడం వల్ల వారికి కావాల్సిన, మెరుగ్గా ఉన్న విద్యార్థులనే వారు గుర్తించి తీసుకోవడం సులభమవుతుంది. ఇది కార్పొరేట్ యాజమాన్యాల ఎత్తుగడల్లో ఇదో భాగం. అయితే అందరు తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రయివేటులో చేర్పించాలనుకోవడం వెనుక సర్కార్ పాఠశాలలపై నమ్మకం సన్నగిల్లేలా పాలకులు వ్యవహరించడమే. తమకు భారమైనా తల్లిదండ్రులు అటువైపు మొగ్గుచూపడానికి ఇది ప్రధాన కారణంగా ఉంది.
పాఠశాలలు ప్రారంభమై వారం దాటింది. అధికారుల పర్యవేక్షణ తీరు, విద్యార్థుల నమోదుకు తీసుకున్న చర్యలేంటో ఇంకా వెల్లడి కాలేదు. గతేడాదికి, ఇప్పటికీ ఫలితాలెలా ఉన్నాయో విశ్లేషణ చేయలేదు.ఈ గణాంకాలను ప్రకటించనూ లేదు. ముఖ్యమంత్రి సమీక్ష కూడా జరపలేదు. అలాంటప్పుడు విద్యావ్యవస్థ ఏ విధంగా బాగుపడుతుంది? పైగా ప్రభుత్వ బడుల్ని ఆరేడు స్వచ్చంధ సంస్థలకు అప్పగించి చేతులు దులుపుకునేలా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్నది. ఇంతపెద్ద విద్యాచట్రంలో ప్రభుత్వం ఒక విజన్ లేకుండా అంత సులువైన నిర్ణయాలు ఎలా తీసుకోగలుగుతుందంటే, దానికి కారణం ప్రభుత్వం ప్రయివేటు వైపు మొగ్గుచూపడమే. ఇందుకు ఓ ఉదాహరణను పరిశీలిద్దాం. 2008లో ఉమ్మడి రాష్ట్రంలో విప్రో సాఫ్టువేర్ దిగ్గజం నేతృత్వంలోని ”అజిత్ప్రేంజీ ఫౌండేషన్” వెయ్యి పాఠశాలల్లో కంప్యూటర్ విద్యకు పునాది వేసింది.ఎన్నిక చేసిన ప్రభుత్వ బడులకు కంప్యూటర్లతో పాటు, ఇన్స్ట్రక్కర్ను ఇచ్చింది.తీరా ఆ స్వచ్చంద సంస్థ కాలపరిమితి ముగిసిపోగానే ఆయా పాఠశాలల్లో చెడిపోయిన కంప్యూటర్లు కనీసం మరమ్మతులు చేయించడం గానీ, ఇన్స్ట్రక్కర్ నియామకం గాని సర్కార్ చేపట్టలేదు. పేరుకు మాత్రం ఏదో చేస్తున్నట్టు చేసి తీరా చేతులెత్తేసే విధంగా తీరు ఉన్నది. అసలు ఆ సంస్థల్ని ఇలా ప్రోత్సహించడమెందుకు? ప్రభుత్వమే బడులకు కంప్యూటర్లను సమకూర్చలేదా? దీన్నిబట్టి చూస్తే విద్యా బాధ్యతల నుండి దూరంగా జరిగే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే పదవతరగతి పరీక్షలు విద్యాహక్కు చట్టం ప్రకారం గ్రేడింగ్ విధానం ద్వారా కాకుండా తిరిగి పాత మార్కులు విధానం ప్రవేశ పెట్టాలనే నిర్ణయం తీసుకుంది.ఈనిర్ణయం కచ్చితంగా ప్రయివేటు పాఠశాల వ్యవస్థ అనధికార పోటీని విస్తృతపరిచే విధంగా ఉంది తప్ప, ఎలాంటి విద్యా ప్రయోజనం రేఖామాత్రంగా నైనా ఈ నిర్ణయం తోడ్పడదు? పైగా తొమ్మిదవ తరగతి వరకు చదువుకున్న, రాసినపరీక్షా విధానానికి భిన్నంగా పదిలో విద్యార్థులు పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదొక చిత్రమైన పరిస్థితికి రాష్ట్రప్రభుత్వం గ్రీన్ సిగల్ ఇచ్చింది?
ప్రభుత్వ బడులైతే ప్రారంభమయ్యాయి కానీ, కనీస సౌకర్యాలు లేని పాఠశాలలు అసంఖ్యాకం? ఇక మధ్యాహ్న భోజనం ప్రక్రియ ఓపెద్ద అంతుపట్టని అన్న ప్రహసనం? ప్రభుత్వం మెనూ అయితే ఇస్తుంది కానీ, పెరుగుతున్న ధరలకనుగుణంగా పెంపుదల లేకపోవడం వలన నాణ్యమైన మధ్యాహ్నభోజనం, మెనూ ప్రకారం క్వాలిటీ, క్వాంటిటీ పిల్లలకు అందడంలేదు?ఈ సమస్య మూలంగానే మధ్యాహ్న భోజనం ఏజెన్సీలు సరుకులు ప్రభుత్వం నేరుగా పాఠశాలలకు సరఫరా చేయాలనే డిమాండ్ సైతం ముందుకు తెస్తున్నాయి. ఈ ఏజెన్సీలకు ఇవ్వాల్సిన బకాయిలు కూడా సకాలంలో విడుదల చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల సంస్కరణ దిశగా ఆలోచన చేసి అందుకనుగుణమైన నిర్థిష్టప్రణాళిక అమలు జరపడం ద్వారా మాత్రమే తెలంగాణా విద్యా వ్యవస్థను గాడిలో పెట్టగలుగుతుంది.సరైన ప్రణాళిక లేని పైపై పటాటోప చర్యలు మూలంగా సాధించేదేమీ ఉండదు. ప్రభుత్వ నిర్లక్ష్యం అనబడే పాకుడు రాయిపై పయనం సాగిస్తున్న ప్రభుత్వ బడులస్థితి మరింత దిగజారుతుంది తప్ప మార్పు రాదు.ప్రభుత్వ బడుల్లో ఏదో చేస్తున్నామనే ప్రచారానికి బదులు వాటిపై ప్రజలకు అవగాహన కల్పించి, ప్రయివేటు విద్యావ్యవస్థ దోపిడీని అరికట్టడం ద్వారా మాత్రమే నాణ్యమైన విద్యను సామాన్యులకు అందించగలుగుతాం. ఆ దిశగా రేవంత్ సర్కార్ ముందుకు సాగడం మంచిది.
ఎన్.తిర్మల్
9441864514