నవతెలంగాణ-హైదరాబాద్ : ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. శనివారం ఏకంగా రూ.700 కోట్లను ఆర్థికశాఖ అన్ని శాఖల ఉద్యోగుల వేతన ఖాతాల్లో జమ చేసింది. వీటిలో గత 20 నెలలుగా పెండింగులో ఉన్న సప్లిమెంటరీ వేతన బిల్లులకు ఒకేసారి రూ.392 కోట్లు విడుదలయ్యాయి. ప్రతినెలా జీతభత్యాలకు ప్రతి ప్రభుత్వ కార్యాలయం నుంచి బిల్లులను ఖజానా శాఖకు దాఖలు చేయడం ఆనవాయితీ. వీటిని దాఖలు చేసే సమయంలో ఎవరైనా ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన వివరాలు పెండింగులో ఉంటే సప్లిమెంటరీ పద్దు కింద మళ్లీ బిల్లును అదే కార్యాలయం దాఖలు చేస్తుంది. ఇలా గత రెండేళ్లలో దాఖలు చేసిన సప్లిమెంటరీ వేతన బిల్లులకు ఇంకా రూ.1,900 కోట్లను ఆర్థికశాఖ విడుదల చేయాల్సి ఉంది.
వీటితోపాటు ఉద్యోగులకు సంబంధించిన అన్ని బిల్లులకు నెలనెలా రూ.700 కోట్ల చొప్పున దశలవారీగా ఇస్తామని జూన్లో మంత్రివర్గం ప్రకటించింది. కాగా, ఈ నెలకు సంబంధించిన రూ.700 కోట్లను శనివారం ఉద్యోగుల ఖాతాల్లో వేసినట్లు ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. సప్లిమెంటరీ వేతన బిల్లులతోపాటు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ బిల్లులకు మరో రూ.308 కోట్లను చెల్లించినట్లు తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మిక, పింఛన్దారుల జాయింట్ యాక్షన్ కమిటీ(ఐకాస) ఛైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్రావు తెలిపారు. ఇంకా ఉద్యోగుల బిల్లులకు రూ.10 వేల కోట్ల వరకు రావాల్సి ఉందన్నారు.