Monday, February 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసహకార రంగంలో తెలంగాణ మార్గదర్శి

సహకార రంగంలో తెలంగాణ మార్గదర్శి

- Advertisement -

ఆ సంఘాల వల్లనే వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు
డిజిటల్‌ స్మార్ట్‌ దిశగా వ్యవసాయ రంగం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

దేశ సహకార రంగానికి తెలంగాణ మార్గదర్శి అనీ, సహకార సంఘాలతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. డిజిటల్‌ స్మార్ట్‌ దిశగా వ్యవసాయ రంగం వెళ్తున్నదని తెలిపారు. అంతర్జాతీయ సహకార వారోత్సవాల-2025 సందర్భంగా నాబార్డు ఆధ్వర్యంలో సోమవారం కోఆపరేటివ్‌ కాంక్లేవ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణ జరిగిందన్నారు. వాణిజ్య బ్యాంకులతో సహకార బ్యాంకులు పోటీ పడాలని సూచించారు. 2024-25లో సహకార సంఘాల ద్వారా రూ.7,500 కోట్ల రుణాలు ఇచ్చినట్టు తెలిపారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనే దిశగా వ్యవసాయ రంగంలో ఆధునికతను పెంపొదించడం తెలంగాణ విజన్‌ -2047 అని చెప్పారు. రైతు ఆదాయాన్ని పెంచడం, పర్యావరణాన్ని కాపాడటం, ఆహార, పోషక స్వయం సమృద్ధి సాధించడం వంటి దీర్ఘకాల లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామని వివరించారు. పీఏసీఎస్‌, ఎఫ్‌పీఓల ఆధ్వర్యంలో ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. సహకార సంఘాలు రైతులకు రుణాలు మాత్రమే కాదు విత్తనాలు, ఎరువులు, సేవలు కూడా అందిస్తున్నాయని చెప్పారు. వంద శాతం రుణాల రికవరీలో పురోగతి సాధించిన 11 ప్రాథమిక వ్యవసాయ సంఘాలకు నాబార్డు ద్వారా మంత్రి తుమ్మల బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిషరీస ఫెడరేషన్‌ చైర్మెన్‌ మెట్టు సాయికుమార్‌, కె.రవీందర్‌రావు, నాబార్డు తెలంగాణ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఉదరుకుమార్‌, ముంబై నాబార్డు సీజీఎం మణికుమార్‌, ఆర్‌బీఐ రీజనల్‌ డైరెక్టర్‌ చిన్మయనీ కుమార్‌, డీసీసీబీ సీఈఓలు, నాబార్డు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -