– వారికే చేప పిల్లల పెంపకం బాధ్యతలు
– సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీలో డిప్యూటీ సీఎం భట్టి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణను రోల్ మోడల్గా నిలిపేందుకు తమ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ప్రజాభవన్లో మహిళలకు సంచార చేపల విక్రయ వాహనాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలను చూసేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాల వారు తెలంగాణకు వచ్చే పరిస్థితిని కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 46 వేల చెరువుల్లో చేప పిల్లల పెంపకానికి రూ.122 కోట్లు విడుదల చేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో చేప, రొయ్య పిల్లల పెంపకం బాధ్యతలను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగిస్తామనీ, ప్రభుత్వం ఆ మేరకు కార్యాచరణ రూపొందిస్తున్నదని చెప్పారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వారితో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయించి, ప్రభుత్వమే వారి నుంచి విద్యుత్ కొనుగోలు చేసి ఆదాయం సమకూర్చే కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో మహిళల చేత పెద్ద ఎత్తున వ్యాపారం చేయించే ఆలోచనలో ప్రభుత్వముందని తెలిపారు. ఐదేండ్లలో రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని వివరించారు. ప్రతి ఏడాది రూ. 20 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయాలని ఇందిరమ్మ ప్రభుత్వం నిర్ణయించి మొదటి ఏడాదిలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రూ.21,600 కోట్లను పంపిణీ చేసినట్టు తెలిపారు. హైటెక్ సిటీ పక్కన శిల్పారామం వద్ద విలువైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇచ్చి ఆర్థికంగా వారిని ప్రోత్సహిస్తున్నదని వివరించారు. అన్ని జిల్లాల్లో డ్వాక్రా బజార్లను ఏర్పాటు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. కార్యక్రమంలో క్రీడలు పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మెన్ మెట్టు సాయికుమార్, సెర్ఫ్ సీఈఓ దివ్య తదితరులు పాల్గొన్నారు.
మహిళల అభివృద్ధిలో తెలంగాణ రోల్ మోడల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES