మహిళలకు సీఎం రేవంత్రెడ్డి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రకృతిని, పూలను పూజించే గొప్ప సంస్కృతికి నెలవు తెలంగాణ అని ముఖ్యమంత్రి ఎ రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లందరికీ ఆయన సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తీరొక్క పూలతో తయారు చేసిన ఘనమైన బతుకమ్మలతో ఆడబిడ్డలందరూ ఆటపాటలతో సద్దుల బతుకమ్మ సంబురాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ సామూహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనమని తెలిపారు. ఈ పండుగ ప్రజల సాంస్కృతిక వైభవం, మహిళల ఐక్యతను చాటి చెప్పడంతోపాటు అనేక సామాజిక అంశాలతో నిండి ఉందని పేర్కొన్నారు.
ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను తొమ్మిది రోజులపాటు రాష్ట్రమంతా అత్యంత వైభవంగా నిర్వహించామని తెలిపారు. బతుకమ్మ విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పడానికి, సరూర్ నగర్ స్టేడియంలో పది వేల మంది మహిళలతో ప్రభుత్వం ఘనంగా వేడుకలను నిర్వహించిందని వివరించారు. ప్రకృతి పరిరక్షణకు ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు. చెరువులు, కుంటలను పదిలంగా కాపాడి భవిష్యత్ తరాలకు వారసత్వంగా అందిస్తుందని పేర్కొన్నారు. అందుకే అంబర్పేట్లో బతుకమ్మకుంటను పునరుద్ధరించామని తెలిపారు.