Saturday, May 31, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవరి సాగులో తెలంగాణ నెంబర్‌ వన్‌

వరి సాగులో తెలంగాణ నెంబర్‌ వన్‌

- Advertisement -

– పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు
– ఎప్పటికప్పుడూ రైతుల ఖాతాల్లో నిధుల జమ : నీటిపారుదల, పౌరసరఫరాల శాఖమంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి

‘వరిసాగులో దేశ చరిత్రలోనే తెలంగాణ నెంబర్‌ వన్‌గా నిలిచింది. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహిస్తూ.. వాటికి సంబంధించిన డబ్బులను ఎప్పటికప్పుడూ రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు అర్హులకే ఇస్తాం. అనర్హులకు ఇచ్చినట్టు తేలితే అధికారులపై చర్యలు తీసుకుంటాం’ అని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌లో గురువారం ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి, ధాన్యం కొనుగోలు, వానాకాలం పంటల సాగు సన్నద్ధతపై ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సుదీర్ఘ సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ యాసంగి సీజన్‌లో 60 లక్షల ఎకరాల్లో 130 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండిందని, 28 మే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రూ.13 వేల కోట్లు చెల్లించామని వెల్లడించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో రైతులకు రూ.2,782 కోట్లు చెల్లించామని, గత ప్రభుత్వ హయాంలోకంటే నాలుగు రెట్లు అధికంగా చెల్లింపులు చేశామని వివరించారు. తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, లారీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వానాకాలం ముందస్తు సాగుకు రైతులను సన్నద్ధం చేయాలని, ఎరువులు, విత్తనాల కొరత రాకుండా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. నకిలీ విత్తనాల నియంత్రణకు టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు.. పకడ్బందీగా భూ భారతి
అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని, అనర్హులకు అందిస్తే అధికారులపై చర్యలు తప్పవని మంత్రి ఉత్తమ్‌ హెచ్చరించారు. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని కలెక్టర్లను ఆదేశించారు. భూభారతి చట్టంతో పట్టాదారులకు ఎటువంటి నష్టమూ రాకుండా చర్యలు తీసుకుంటున్నామని, భూమికి భూదార్‌ కార్డు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సింగరేణి భూముల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని తెలిపారు. ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టులతోపాటు ఇతర ప్రాజెక్టుల డీ-సిల్టేషన్‌ ప్రక్రియను ఆధునిక పద్ధతుల్లో పూర్తి చేసి పూర్వపు సామర్థ్యాన్ని తిరిగి తీసుకొస్తామని వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, విజయ రమణారావు, ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌, డాక్టర్‌ సంజరు కుమార్‌, ఎమ్మెల్సీలు మల్కా కొమరయ్య, చిన్నమైలు అంజిరెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -