– సొంత ఇమేజ్ను పెంచుకునే పనిలో ఎమ్మెల్సీ కవిత
– జాగృతి నూతన కార్యాలయం ఏర్పాటు
– ఇక అక్కడి నుంచే అన్ని కార్యకలాపాలు
– పార్టీ పెడితే దాని ఆఫీసు కూడా అదేనంటున్న నాయకులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇప్పటిదాకా బీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న సాంస్కృతిక సంస్థ ‘తెలంగాణ జాగృతి’ ఇక నుంచి ఆ పార్టీకి సమాంతరంగా మారబోతోంది. గులాబీ పార్టీ నేతలు, శ్రేణులు చేపట్టని కార్యక్రమాలను అది భుజాన వేసుకోనుంది. వాటిని నిర్వహించేందుకు వీలుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని తన నివాసానికి ఆనుకుని ఉన్న ఓ భవనంలో జాగృతి ఆఫీసును ఏర్పాటు చేసిన ఆమె… శనివారం దాన్ని తన కుటుంబ సభ్యులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఇటు అధికార కాంగ్రెస్తోపాటు అటు బీజేపీపై విమర్శలు గుప్పించిన కవిత… అదే సమయంలో ‘బీఆర్ఎస్కు సమాంతరంగా కార్యక్రమాల’ను నిర్వహిస్తామని చెప్పకనే చెప్పారు. తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులిస్తే ఎందుకు స్పందించలేదంటూ బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించిన ఆమె… తెలంగాణ జాగృతి కార్యాచరణలో భాగంగా మొదట అదే అంశంపై ధర్నా చేయనున్నట్టు ప్రకటించటం గమనార్హం. ఈనెల నాలుగున ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తామని ఆమె తెలిపారు. కేసీఆర్పై ఈగ వాలినా సహించబోమని హెచ్చరించిన కవిత…ఆయనకు బీఆర్ఎస్ అనేది ఒక కన్నయితే, జాగృతి మరో కన్నంటూ వ్యాఖ్యానించారు. పార్లమెంటులో బీసీ బిల్లు ఆమోదించకపోతే బీజేపీకి సెగ తగిలేలా పోరాటం చేస్తామని తెలిపారు. వివిధ సమస్యలపై త్వరలో రైల్రోకోలాంటి కార్యక్రమాలకు సైతం పిలుపునిస్తామని చెప్పారు. జాగృతిలో ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు విభాగాలను కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మరోవైపు కవిత దూకుడు, కార్యక్రమాల్లో వేగం పెంచటంపై పలు రకాల గుసగుసలు వినబడుతున్నాయి. లిక్కర్ కేసులో అరెస్టయి, జైలు నుంచి విడుదలైన తర్వాత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమెను ఒక్కసారి కూడా కలవకపోవటంపై కవిత తీవ్రంగా కలత చెందినట్టు సమాచారం. ‘కేసులున్నాయి కాబట్టి, కొద్దికాలం నిశ్శబ్దంగా ఉండాలి, అవన్నీ పూర్తయ్యేదాకా బయటకు రావొద్దు, ఎంపీ ఎన్నికల్లో ఓటమికి కూడా లిక్కర్ కేసే కారణం, అందువల్ల అది పూర్తిగా కొట్టేసేదాకా బయటకు రావద్దు, అది కొట్టేసిన తర్వాత ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలి…’ అంటూ కేసీఆర్ పార్టీలోని పెద్దల ద్వారా గతంలోనే కవితకు సూచించినట్టు సమాచారం. దాంతో ఆమె కినుక వహించారు. తనను పార్టీలో కావాలనే దూరం పెడుతున్నారంటూ ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తన తండ్రికి కవిత రాసిన లేఖ లీకవటం, అది తీవ్ర చర్చనీయాంశం కావటం, తదనంతర పరిణామాలపై చర్చించేందుకు మాజీ మంత్రి హరీశ్రావు, ఇతర సీనియర్లు ఎర్రవల్లిలోని ఫామ్హౌస్లో కేసీఆర్ను కలిసినా ప్రయోజనం లేకపోయింది. ఆయన ఈ అంశాలపై పెద్దగా ఆసక్తి చూపటం లేదనీ, అసలు వాటి ప్రస్తావనే తీసుకురావటం లేదని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఇది కూడా కవిత ఆగ్రహానికి కారణమైంది. ఈ నేపథ్యంలో తనను పట్టించుకోని తన తండ్రి తీరుకు నిరసనగా ఆమె తెలంగాణ జాగృతి పేరిట హల్చల్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఆ సంస్థకు నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, హడావుడిగా ప్రారంభించినట్టు కవిత సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు కేసీఆర్కు వదిన కొడుకు, రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినేపల్లి సంతోశ్కుమార్పై కూడా ఆమె గుర్రుగా ఉన్నట్టు సమాచారం. పార్టీలో కోవర్టులు, దెయ్యాలున్నాయంటూ ఇటీవల కవిత వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అవన్నీ సంతోశ్కుమార్ను ఉద్దేశించి చేసినవేనని సమాచారం. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కవిత ‘తెలంగాణ జాగృతి’ కార్యక్రమాల వరకే పరిమితమవుతారా? లేక సొంత కుంపటి పెడతారా? అనే చర్చలు కూడా కొనసాగుతున్నాయి. ఒకవేళ ఆమె సొంత పార్టీ పెడితే… ఇప్పుడు జాగృతి కోసం ఏర్పాటు చేసిన ఆఫీసునే పార్టీ కార్యాలయం కోసం వాడుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ‘అధిష్టానం తన పట్ల వ్యవహరించే తీరును బట్టే కవిత కార్యాచరణ ఉంటుంది…’ అని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించటం గమనార్హం.
ఇప్పటికైనా ‘జై తెలంగాణ’ అనండి.. :సీఎం రేవంత్కు కవిత సూచన
ముఖ్యమంత్రి రేవంత్ తెలంగాణ సోయితో పరిపాలన చేయటం లేదని కవిత ఈ సందర్భంగా విమర్శించారు. ఆయన ఇప్పటి వరకూ ‘జై తెలంగాణ’ అని నినదించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కనీసం సోమవారమైనా ‘జై తెలంగాణ’ అని నినదించాలని ఆమె సీఎంను డిమాండ్ చేశారు. యువతకు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ప్రారంభించబోతున్న ‘రాజీవ్ యువ వికాసం పథకం’ పేరు మార్చాలని కోరారు. అమరులు శ్రీకాంతాచారి, యాదిరెడ్డి, ప్రజాకవి కాళోజీ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావులలో ఎవరో ఒకరి పేరును ఆ పథకానికి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నీళ్లను ఏపీ తరలించుకుపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి నోరు మెదపటం లేదని కవిత దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టును నిర్మించి నీళ్లు తరలించాలనుకుంటున్నా రేవంత్ కనీసం స్పందించడం లేదని విమర్శించారు. పక్క రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఎందుకు పనిచేస్తున్నారని ఆయన్ను నిలదీశారు. ఇప్పుడు పోలవరం నుంచి 200 టీఎంసీల గోదావరి నీళ్లను ఏపీకి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా తెలంగాణకు అవి శాశ్వతంగా దూరం కానున్నాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంనాడు ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలని సీఎం రేవంత్ను డిమాండ్ చేశారు. దీనిపై అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేయాలని సూచించారు.
బీఆర్ఎస్కు సమాంతరంగా తెలంగాణ జాగృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES