– విడుదల చేయించిన కేటీఆర్
– సొంత ఖర్చులతో బీఆర్ఎస్ నేత జాన్సన్ నాయక్ న్యాయ పోరాటం
– నందినగర్లో కేటీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన బాధితులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉపాధి కోసం గత సంవత్సరం ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం లింగాపూర్, దస్తురాబాద్ మండలం మూన్యాల్ గ్రామాలకు చెందిన ఆరుగురు వ్యక్తులు మలేషియాకు వెళ్లారు. అక్కడ అకారణంగా అరెస్టై జైలుపాలయ్యారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నేత ఖానాపూర్ ఇన్చార్జి భూక్య జాన్సన్ నాయక్తో మాట్లాడి వారి విడుదలకు ప్రయత్నించాలని కోరారు. దీంతో బాధిత కుటుంబాలను కలిసిన జాన్సన్ నాయక్ వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారి దీనస్థితిని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కేటీఆర్ సూచనతో మార్చి నెలలో మలేషియా వెళ్లిన జాన్సన్ నాయక్, జైల్లో ఉన్న లింగాపూర్ గ్రామానికి చెందిన రాచకొండ నరేష్, తలారి భాస్కర్, గురుజాల శంకర్, గురిజాల రాజేశ్వర్, గుండా శ్రీనివాస్, మూన్యాల్ గ్రామానికి చెందిన యమునూరి రవీందర్లను కలిసి ఓదార్చారు. విడుదల చేయిస్తానని భరోసా కల్పించారు. అక్కడి చట్టాల పట్ల అవగాహన లేకపోవడంతో అక్రమ ఆయుధ కేసులో అరెస్ట్ అయ్యారని తెలుసుకున్న జాన్సన్ నాయక్, వారి విడుదల కోసం సొంత ఖర్చులతో స్థానిక న్యాయవాదులను నియమించి న్యాయపరమైన ప్రక్రియను వేగవంతం చేశారు. ఇటీవల మే 12న మలేషియాకు మళ్లీ వెళ్లి అక్కడి కోర్టు విధించిన జరిమానా మొత్తాన్ని చెల్లించి, విమాన టికెట్లతో సహా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి వారిని స్వదేశానికి తీసుకొచ్చారు.
బుధవారం హైదరాబాద్కు చేరుకున్న బాధితులు జాన్సన్ నాయక్తో కలిసి నందినగర్లో కేటీఆర్ని కలిసారు. కేటీఆర్ను చూడగానే భావోద్వేగానికి గురైన బాధితులు, జైల్లో ఉండగా ఈ దేశాన్ని తమ పిల్లలను చూస్తామని అనుకోలేదన్నారు. కేటీఆర్, జాన్సన్ నాయక్ల కృషితో తాము విడుదలయ్యామని, జీవితాంతం వారిని తమ గుండెల్లో పెట్టుకుంటామని చెప్పారు. చైనా, ఇతర దేశాలు తమ వారిని దగ్గరుండి వారం రోజుల్లో విడిపించి తీసుకు వెళ్లి పోయాయని బాధితులు కేటీఆర్తో తెలిపారు. వారిని ఓదార్చిన తర్వాత వారి బాగోగులను, అక్కడ వారికి ఎదురైన కష్టాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. వారి పరిస్థితి పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. జాన్సన్ నాయక్ ను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. భారత రాయబార కార్యాలయం కానీ, తెలంగాణ ప్రభుత్వం గానీ బాధితులను విడిపించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమని విచారం వ్యక్తం చేశారు. కనీసం న్యాయవాదులను పెట్టి వెంటనే విడిపిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
మలేషియా జైల్లో తెలంగాణవాసులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES