Saturday, February 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపర్యావరణ పరిరక్షణ దిశగా తెలంగాణ ఆర్టీసీ అడుగులు

పర్యావరణ పరిరక్షణ దిశగా తెలంగాణ ఆర్టీసీ అడుగులు

- Advertisement -

ఎలక్ట్రిక్‌ బస్సుల నిర్వహణలో
దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఆర్టీసీ రికార్డ్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరవాసులను అనారోగ్యానికి గురి చేసే వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్‌ బస్సులను వినియోగించాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. హైదరాబాద్‌లో కాలుష్యరహిత ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. పాత డీజిల్‌ బస్సులను ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చే ‘రెట్రో ఫిట్మెంట్‌’ సాంకేతికతపై వీసీ, ఎండీ నాగిరెడ్డితో పాటు సంస్థ అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా ‘రెట్రో ఫిట్మెంట్‌’ కోసం గత ఏడాది సెప్టెంబర్‌ 15న టెండర్లు పిలవగా అదే నెలలోని 30వ తేదీన 3న టెండర్‌ ప్రక్రియ ముగియడంతో సాయి గ్రీన్‌ మొబిలిటీ సంస్థకు 200, కల్యాణి పవర్‌ ట్రైన్‌ లిమిటెడ్‌కు 40 బస్సు లను ‘రెట్రో ఫిట్మెంట్‌’ చేసే బాధ్యతను ఆర్టీసీ అప్పగించింది.

2027 నాటికి హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ లోపల 2,800 ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టాలనే లక్ష్యంతో సంస్థ పని చేస్తున్నది. వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గి ప్రజా రవాణా పెరగడంతో కాలుష్యం తగ్గుతుందని అధికారులు అంచనాగా ఉంది. శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులు తగ్గి ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే నగరంలోని ఆరు డిపోల పరిధిలో 325 ఎలక్ట్రిక్‌ బస్సులు నడుస్తుండగా, ఈ ఏడాదిలో మరో 175 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. రాబోయే బస్సుల కోసం అదనంగా 19 డిపోలలో ఛార్జింగ్‌ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. కొత్తగా 10 డిపోలు, 10 చార్జింగ్‌ కేంద్రాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మౌలిక సదుపాయాల కోసం సుమారు రూ.392 కోట్ల వ్యయం అవుతుందని అంచనా.

”సక్సెస్‌ అయిన ముషీరాబాద్‌ ప్రయోగం”
2023లోనే ముషీరాబాద్‌ డిపోకు చెందిన ఒక డీజిల్‌ బస్సును ప్రయివేటు సంస్థ సహకారంతో ఎలక్ట్రిక్‌ బస్సుగా మార్చారు. ప్రస్తుతం ఈ బస్సు ఉప్పల్‌ డిపో పరిధిలో విజయవంతంగా నడుస్తోంది. హైదరాబాద్‌ భవిష్యత్తు కోసం తీసుకొస్తున్న ఈ హరిత ప్రయాణాన్ని ప్రజలు ఆదరించాలని ఆర్టీసీ వీసీ, ఎండీ వై.నాగిరెడ్డి కోరారు. నగర ప్రజా రవాణా రూపురేఖలను మార్చే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బస్‌ భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్స్‌ మునిశేఖర్‌, వెంకన్న, రాజశేఖర్‌, విజయపుష్ప సాయి గ్రీన్‌ మొబిలిటీ కల్యాణీ పవర్‌ ట్రైన్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు, తదితర సంస్థ అధికారులు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -