– వానాకాలంలో 70.82 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు
– రైతాంగానికి సంక్రాంతి శుభాకాంక్షలు : పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ వానాకాలం (2025-26) సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం ముందెన్నడూ లేని విధంగా 70.82 లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేసి రికార్డు నెలకొల్పిందని పేర్కొన్నారు. గతంలో కొనుగోలు చేసిన 70.2 లక్షల మెట్రిక్ టన్నుల రికార్డును అధిగమించామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇదోక చారిత్రాక మైలురాయిగా ఆయన అభివర్ణించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, నీటిపారుదల శాఖల సమన్వయంతోపాటు రైతుల భాగస్వామ్యం, సిబ్బంది సహకారంతోనే ఈ రికార్డు సాధ్యమైందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ అనుకూల విధానాలకు ధాన్యం కొనుగోళ్ల రికార్డు అద్దంపడుతుందని గుర్తు చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 32.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దొడ్డు రకం కాగా 38.37 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలు ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో సాధించిన దిగుబడికిగానూ 13.97 లక్షల మంది రైతులకు మద్దతు ధర అందించామని పేర్కొన్నారు. దీనికిగానూ రూ.16,912 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటికి రూ. 16,602 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. ధాన్యం సేకరణకు 8,448 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం వల్లనే ధాన్యం కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని మంత్రి తెలిపారు. ధాన్య సంపదకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పర్వదినాన్ని జరుపుకుంటున్న రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు ముఖ్యంగా రంగవల్లులు అద్దుతున్న మహిళామణులకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రికార్డు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



