Sunday, June 29, 2025
E-PAPER
Homeకవర్ స్టోరీబోనమెత్తిన తెలంగాణ

బోనమెత్తిన తెలంగాణ

- Advertisement -

ప్రకృతి ఆరాధనే మనకు అనాదిగా వస్తున్న సంస్కతి. ప్రకతిని ఆరాధిస్తాము. ప్రకతే మన మనుగడకు మూలము. అలాంటి ప్రకతిని పూజించడమే మన సంప్రదాయం. మన పూర్వీకులు మనకు ఆపాదించిన ఆచారవ్యవహారాలు, పండుగలు, సంస్కతి సంప్రదాయాలన్నీ మనకు ఆరోగ్యాన్ని ఆనందాన్ని కలిగించేవే. వాటిలోని ఆంతర్యం తెలుసుకొని ఆచరిద్దాం.
ఆషాఢమాసం వచ్చిందనగానే ప్రపంచదష్టి అంతా మనవైపే.. ఎందుకంటారా! మన తెలంగాణలో బోనాలపండుగ షురూ కదా!!
చిన్నపెద్దా అంతా కోలాహలంగా జరుపుకునేపండుగ బోనాలు.
తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా జరుపుకునే పండుగల్లో బోనాల పండుగ ఒకటి. ఇది మన రాష్ట్ర పండుగ. ఈ పండుగను ఆషాఢ మాసంలో జరుపుకుంటారు.
1813 సంవత్సరంలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల్లో ప్లేగు వ్యాధి ప్రబలి అనేకమంది మత్యువాతపడ్డారు. హైదరాబాదు నుండి మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి వెళ్ళిన సైనిక బెటాలియన్‌ అక్కడ మహంకాళి అమ్మవారిని తన ప్రజలను రక్షించమని వారు క్షేమంగా ఉంటే హైదరాబాదులో అమ్మవారిని ప్రతిష్టించి పూజలు చేస్తామని ప్రార్థించారు. ప్లేగువ్యాధి తగ్గి ప్రజలు సంతోషంగా ఉండటంతో 1815 సం.లో హైదరాబాదులో మహంకాళి అమ్మవారి విగ్రహం ప్రతిష్టించి గుడికట్టించి కతజ్ఞతగా బోనాలు సమర్పించడం ప్రారంభించారు.

వర్షాలు సమద్ధిగా కురిసి, పాడిపంటలు అభివద్ధి చెందాలని వ్యాధులపీడలు తొలగి ప్రజలంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని గ్రామదేవతలను పూజిస్తారు. గ్రామదేవత మహంకాళి, మారమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, అంకాలమ్మ, ముత్యాలమ్మ మొదలగు రూపాలలో పూజించబడుతుంది. ఈ గ్రామదేవతలు గ్రామాలకు కాపలాగా ఉండి ప్రజలను ఎల్లవేళలా రక్షిస్తారని మన నమ్మకం.
భోజనం అనే సంస్కత పదానికి వ్యవహారిక రూపం బోనం. అమ్మవారిని ఆడపడుచుగా భావించి ప్రేమానురాగాలతో భోజనం పెట్టడమే బోనం అన్నమాట. కొత్త మట్టికుండ లేదా ఇత్తడి సర్వకు పసుపురాసి, కుంకుమబొట్లు పెట్టి, వేపాకులు, బంతిపూలతో అలంకరిస్తారు. కుండలో పసుపు కలిపిన అన్నం కానీ బెల్లపు అన్నం పెట్టి దానిపై చిన్నకుండను పెట్టి బెల్లం, పెరుగుపోస్తారు. దానిపై ప్రమిదలో నూనెపోసి జ్యోతిని వెలిగిస్తారు. ఈ విధంగా బోనాన్ని తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో కుండలో కూరగాయలు, పచ్చిపులసు ఉంచుతారు. అతివలంతా బోనాలను నెత్తిన ఎత్తుకొని ఆలయానికి వెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు.
బోనాల ఉత్సవం ఆషాఢమాసం తొలిఆదివారం కానీ, తొలి గురువారం కానీ ప్రారంభ మవుతుంది. అమ్మవారిని ఇంటి ఆడపడుచుగా భావించి ఆమెను పుట్టింటికి తీసుకువచ్చే ”ఎదురుకోళ్ళ”తో సంబరం ప్రారంభం అవుతుంది. పూర్ణకుంభంతో అమ్మవారికి స్వాగతం పలికి అమ్మవారిని ఆవాహన చేసిన ప్రత్యేక కలశాలను పురవీధులలో ఊరేగిస్తారు. దీన్ని ” ఘటోత్సవం” అంటారు. ఇది ఉత్సవ ఆరంభం.

అమ్మవారికి వస్త్రాలను, కానుకలను, ఒడిబియ్యాన్ని సమర్పించడాన్ని ”ఊరడి” అంటారు.
పోతురాజును గ్రామదేవతకు సోదరునిగా భావిస్తారు. పోతురాజు ఊరేగింపుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు. ఒంటినిండా పసుపురాసుకొని, జుట్టు విరబోసుకొని, నుదుటన పెద్దగా తిలకం దిద్దుకొని, నడుము చుట్టూ ఎర్రని వస్త్రాన్ని ధరించి, కాళ్ళకు గజ్జెలు పెట్టుకొని, ఒక చేత్తో కొరడా పట్టుకొని, లయబద్దంగా నత్యంచేస్తూ వెళతాడు. వెనక స్త్రీలు పట్టుచీరెలు కట్టుకొని, నగలు పెట్టుకొని అందంగా ముస్తాబై నెత్తిన బోనం ఎత్తుకొని డప్పుల దరువులతో శివసత్తుల పూనకాలతో మంగళహారతులతో ఊరేగింపుగా ఆలయానికి వెళతారు.

ఊరేగింపులో మహిళలు ఆలయానికి చేరుజున్నప్పుడు వారు అమ్మవారి ఆత్మను కలిగి ఉంటారని భావించి అమ్మవారి రౌద్రరూపాన్ని శాంతింపజేయడానికి కాళ్ళపై నీళ్ళను చల్లుతారు. దీనిని దూకుడుగా భావిస్తారు. తర్వాత భక్తులు తెచ్చిన రంగులకాగితాలు, కర్రలతో చేసిన ”తొట్టెలను” అందిస్తారు. ఇది గౌరవసూచకంగా భావిస్తారు.
పండుగనాడు గుడిలో అమ్మవారి విగ్రహం ముందు బియ్యంపిండిలో పసుపు కలిపి సంప్రదాయ పద్ధతిలో ,నిష్టతో పటం వేస్తారు. ఈ పటం ముందు అఖండ దీపం వెలిగించి భక్తులు తెచ్చిన నైవేద్యాన్ని అక్కడరాశిగా పోస్తారు.
అమ్మకు సాకం, పాకం సమర్పించడం ఆనవాయితీ. సాకం అంటే వండని ఆహారం. వేపమండలను పసుపునీటిలో ఉంచి సమర్పిస్తారు. పాకం అంటే వండిన ఆహారం పాయసం లాంటివి సమర్పిస్తారు.

అమ్మవారికి మొదటిబోనం జోగినిలు సమర్పిస్తారు. ఉత్సవాలకు ప్రధాన ఆకర్షణ, గంభీరమైన శక్తిని తీసుకువచ్చేది శివశక్తులే. వీరు అమ్మవారకి పరమభక్తులు. వీరు బోనాన్ని మోసే విధానం, నత్యం చేసే విధానం, హావభావాలు చూపరులను ఇట్టే కట్టి పడేస్తాయి. వీరు అమ్మవారికి బోనం సమర్పిస్తే వీరికి ఆరోగ్యంతో పాటు పాజిటివ్‌ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు. వీరు భక్తులకు బండారి (పసుపుబొట్టు) పెట్టి ఆశీర్వదిస్తే భక్తుల కోరికలు నెరవేరి ఆయురారోగ్యాలతో ఉంటారని విశ్వాసం.
చివరగా అమ్మవారి భక్తురాలైన మహిళ మట్టికుండమీద నిలబడి రాబోయే కాలం ఎలా ఉండబోతోందో భవిష్యవాణి చెబుతుంది. దీన్ని ”రంగమెక్కుడు” అని పిలుస్తారు. దీనితో బోనాల ఉత్సవం ముగుస్తుంది.

ఆషాఢ, శ్రావణ మాసాల్లో వర్షాలు కురవడం వల్ల నేలపై నీరు నిలిచి జలశయాల్లో దోమలు, నేల చిత్తడిగా మారడం వల్ల అనేక క్రిమికీటకాలకు ఆవాసం అవుతుంది. నీరు గాలి కలుషితమవుతాయి. కలరా, డయేరియా వంటి వ్యాధులు, చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో బోనాల పండుగ జరుపుకోవడం ద్వారా అనేక ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి. పండుగలో ఉపయోగించే పదార్థాల్లో, వ్యవహారాల్లో శాస్త్రీయకోణం దాగి ఉంటుంది.
పసుపు
పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆంటి యాక్సిడెంట్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు కలిగిఉంటుంది. ఇది చర్మవ్యాధుల నుండి రక్షణకల్పిస్తుంది. మొటిమలు, మచ్చలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. పైత్యరస ఉత్పత్తిని పెంచడం ద్వారా కొవ్వును త్వరగా జీర్ణం చేయిస్తూ గుండెజబ్బుల నుండి కాపాడుతుంది. దీనిలో ఉండే ‘కర్కుమిన్‌’ నొప్పులను తగ్గించి ఆస్టియో ఆర్థరైటిస్‌ నుండి ఉపశమనం కలిగిస్తుంది. బ్రెయిన్‌ ఫంక్షన్‌ ను మెరుగుపరిచి అల్జీమర్స్‌, నాడి సంబంధ వ్యాధులనుండి కాపాడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్‌ నుండి కాపాడుతుంది. రక్తంలో గ్లూకోజు స్థాయిని తగ్గిస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న పసుపు మన ఆహారంలో వాడటం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

వేపాకు
వేపాకు రక్తంలో చక్కెర స్థాయి ని తగ్గిస్తుంది. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్‌ యాంటీ ఫంగల్‌ లక్షణాలు ఉండటం వల్ల చర్మవ్యాధుల ను నిరోధిస్తుంది. దీనిలో ఉండే యాంటీ మైక్రోబియల్‌ గుణాలవల్ల పేగు ఇన్ఫెక్షన్‌ ను తగ్గిస్తుంది. దంతాల నొప్పి, చిగుళ్ళ సమస్యలను నివారిస్తుంది. చుండ్రుపేలు ను నివారించి జుట్టు దృఢత్వాన్ని పెంచుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. రక్తంలోని మలినాలను తొలగించి రక్తప్రసరణ ను మెరుగుపరుస్తుంది. కాలేయ కణజాల నష్టం జరగకుండా కాపాడుతుంది.
బెల్లం

బెల్లంలో ఐరన్‌ ఉండటం వల్ల రక్తహీనతను తగ్గించి ఋతుసమస్యలను అరికడుతుంది. పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును తగ్గిస్తుంది. శ్వాసకోశ సంబంధ వ్యాధులనుండి ఉపశమనం కల్గిస్తుంది. ఎముకల పటిష్టతకు సహకరిస్తుంది.


గుగ్గిలం/ మైసాచి
ఊరేగింపులో గుగ్గిలం పొగ వేయడం ఆచారం. ఈ పొగ వల్ల వాతావరణంలోని క్రిమికీటకాలు నశిస్తాయి.
ఇలా పండుగలో వాడే పదార్థాల్లో ఏదో ఒక ఔషధగుణం ఉంటుంది. అంతేకాకుండా పండుగల ద్వారా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత స్నేహతత్వం, కలుపుగోలుతనం, సమైఖ్యభావం, ప్రకతిపట్ల కతజ్ఞతాభావం పెంపొందుతాయి.
ఈ సంవత్సరం బోనాల పండుగ జూన్‌ 26 నుండి ప్రారంభమై జూలై 24 వరకు జరుగుతుంది. జూన్‌ 26 న గోల్కొండ ఆలయంలోని శ్రీజగదాంబిక అమ్మవారికి బోనం సమర్పించడంతో ప్రారంభం అవుతుంది. జూన్‌ 29 న విజయవాడ కనకదుర్గమ్మ కు, జూలై 13 న సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి, తర్వాత బల్కంపేట ఎల్లమ్మతల్లికి, చిల్కలగూడ పోచమ్మతల్లికి, జూలై20 న భాగ్యనగర్‌ లాల్‌ దర్వాజా సంహవాహిని అమ్మవారికి, అక్కన్న మాదన్న ఆలయంలో, షాలిబండాలోని ముత్యాలమ్మకు బోనాలు సమర్పిస్తారు. జూన్‌ 21 న ఉమ్మడిదేవాలయాల ఘటాల ఊరేగింపు, 24 న ముగింపు కార్యక్రమం జరుగుతుంది. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు గోల్కొండలోని శ్రీజగదాంబిక ఆలయంలో బోనాలను సమర్పించినట్లు చరిత్ర చెబుతోంది. అందుకే ఈ ఆలయం నుండే బోనాల వేడుక ప్రారంభమవుతుందని అంటారు.
కాలానుగుణంగా వచ్చేమార్పులకు మన శరీరం అనుకూలించడానికి జన సంస్కతి తోడ్పడుతుంది. జన సంస్కతిని కాపాడుకుందాం.. భావితరాలకు పదిలంగా అందిద్దాం.

అయిత అనిత
8985348424

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -