ఏపీ సీపీఐ(ఎం) రాష్ట్ర విస్తృత సమావేశం తీర్మానం
అమలు కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని ప్రజలకు పిలుపు
స్మార్ట్ మీటర్లు బిగించకుండా అడ్డుకోవాలి
అందరికీ సంక్షేమ పథకాలు
అమరావతి : ఎన్నికల ముందు టిడిపి కూటమి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వేగంగా అమలు చేయాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర విస్తృత సమావేశం తీర్మానించింది. ఎన్నికల హామీల అమలు కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని ప్రజలను కోరింది. రెండు రోజులపాటు జరిగే సిపిఎం రాష్ట్ర విస్తృత సమావేశం బుధవారం విజయవాడలో ఎంబివికెలో ప్రారంభమైంది. తొలుత పార్టీ పతాకాన్ని సిపిఎం సీనియర్ నాయకులు సిహెచ్ నరసింగరావు ఆవిష్కరించారు. పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు యు వాసుకి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సమావేశంలో పార్టీ పోలిట్బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు డి రమాదేవి పాల్గొన్నారు. ఈ సమావేశానికి పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎవి నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు వి సావిత్రి, యం హరిబాబు, బి కిరణ్ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. సంతాప తీర్మానాన్ని రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎవి నాగేశ్వరరావు ప్రవేశపెట్టగా, ప్రతినిధులు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి రాంభూపాల్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. దీనికి సంబంధించి పూర్తి పాఠం…
తెలుగుదేశం నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2025 జూన్ 12 నాటికి సంవత్సరం పూర్తయ్యింది. జగన్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ప్రజలు టిడిపి కూటమికి ఎన్నడూలేనంత ఘన విజయం చేకూర్చారు. ప్రజల ఆశలకు తగ్గట్లుగా పాలన లేదు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్పొరేట్ల కొమ్ము కాస్తున్నది. ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నది. మాట తప్పి ప్రజలపై భారాలు మోపుతోంది. ఎన్నికల్లో చెప్పిన హామీలకు విరుద్ధంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, సంక్షేమ పథకాల అమల్లో కోతలు, ఆస్తిపన్ను పెంపుదలను తక్షణం ఉపసంహరించుకోవాలని, ఇళ్లపట్టాల పంపిణీ వెంటనే చేపట్టాలని సమావేశం డిమాండ్ చేసింది.
స్మార్ట్ మీటర్ల బిగింపును ప్రజలు అడ్డుకోవాలి
గత వైసిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన తెలుగుదేశం, జనసేన పార్టీలు నేడు అదే విధానాన్ని అమలు చేయడం ప్రజలను వంచించడమే. ప్రతిపక్షంలో ఉండగా స్మార్ట్ మీటర్లను పగులగొట్టమని ప్రజలకు పిలుపునిచ్చిన తెలుగుదేశం నాయకులు నేడు పగులగొట్టిన ప్రజలపై పోలీసు కేసులు పెడుతున్నారు. రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ స్మార్ట్ మీటర్ల ఏర్పాటును అనుమతిస్తూ ఎపిఇఆర్సి ఇచ్చిన తీర్పును సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను బిగించకుండా డిస్కంలకు ఆదేశాలు జారీ చేయాలని సమావేశం డిమాండ్ చేసింది.
స్మార్ట్మీటర్లు బిగించినచోట బిల్లులు ఎక్కువ వస్తున్నాయి. ప్రజల్లో వస్తున్న అసంతృప్తిని పక్కదారి పట్టించేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారు. మీటర్ల ఏర్పాటుకు అదానీ కంపెనీకి గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు కొనసాగిస్తున్నది. సెకీ ద్వారా అదానీతో జరిగిన అవినీతికర విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయకుండా విద్యుత్ భారాలు తగ్గిస్తామని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమే. రూ.1.20 లక్షల కోట్ల అదనపు భారాన్ని వినియోగదారులపై మోపడానికి ఈ ప్రభుత్వం సిద్ధమైందని పేర్కొంది. వెంటనే సెకీ ఒప్పందాలను రద్దుచేయాలని, బిల్లుల భారం మోపే స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని, లేదంటే ప్రజలే వాటిని బిగించకుండా అడ్డుకోవాలని విస్తృత సమావేశం విజ్ఞప్తి చేసింది.
అందరికీ సంక్షేమ పథకాల అమలు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు నెలకు రూ.25 వేలలోపు ఆదాయం ఉండే వారందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించి దానికి భిన్నంగా నేడు సంక్షేమ పథకాలపై అడ్డగోలు షరతులు పెట్టి కోతలు విధిస్తోందని సమావేశం తెలిపింది. రూ.15 వేల చొప్పున తల్లికి వందనం అమలు చేస్తున్నామని తల్లుల అకౌంట్లలో రూ.13,000 మాత్రమే వేస్తున్నారని పేర్కొంది. పారిశుధ్య కార్మికులకు ఇస్తామని ఉత్తర్వులిచ్చినప్పటికీ లాక్ ఓపెన్ కావడం లేదని నిరాకరిస్తున్నారని, అతి తక్కువ ఆదాయాలు వస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, స్కీమ్ వర్కర్లకు, మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులు అనే పేరుతో అమలు చేయడం లేదని తీర్మానం తెలిపింది. కేవలం సిఎఫ్ఎమ్ఎస్ వేతనాలు తీసుకున్నంత మాత్రాన ప్రభుత్వ ఉద్యోగులు కాదని, వీరిలో అనేకమందికి రూ.10 వేలు అంతకన్నా తక్కువ వేతనం వచ్చేవారేనని వివరించింది.
కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రూ.25 వేలు ఆదాయాలు వస్తున్నాయి. అంగన్వాడీ వర్కరుకు రూ.11,500, హెల్పరుకు రూ.7,000, ఆశాలకు రూ.10,000 మాత్రమే ఇస్తున్నారని, కావున ప్రభుత్వ ఉద్యోగులు అనే విధానాన్ని తొలగించి గ్రామాల్లో రూ.20,000, పట్టణాల్లో నెలకు రూ.25,000లోపు ఆదాయం వచ్చే వారందరికీ తల్లికి వందనం సహా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని సిపిఎం డిమాండ్ చేస్తున్నది.
జిఓ 30 అమలు చేసి పేదల ఇళ్లకు వెంటనే పట్టాలివ్వాలి
ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు వేసుకుని నివాసముంటున్న పేదలకు జిఓ 30 ప్రకారం ఇంటి పట్టాలివ్వాలని, ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదలకు నెలరోజుల్లో ఇంటి పట్టాలు ఇస్తామని జనవరిలో జిఓను విడుదల చేసి ఇప్పటి వరకు అమలుకు చర్యలు తీసుకోవడం లేదని తీర్మానంలో పేర్కొంది.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను వేగంగా అమలు చేయాలి
- Advertisement -
- Advertisement -