Saturday, June 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంటెంపుల్‌ టూరిజాన్ని ప్రోత్సహించాలి

టెంపుల్‌ టూరిజాన్ని ప్రోత్సహించాలి

- Advertisement -

సీజీఎఫ్‌ నిధులు పారదర్శకంగా వినియోగించాలి : దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలో టెంపుల్‌ టూరిజాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. వరంగల్‌ భద్రకాళి దేవాలయంలో ఆషాడ బోనాలను ఈసారి ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. దేవాలయాల అభివృద్ధికి సీజీఎఫ్‌ నిధులను పారదర్శకంగా వినియోగించాలని సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో దేవాదాయ శాఖ సీజీఎఫ్‌ కమిటీ సమావేశం జరిగింది. అందులో మంత్రితో పాటు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌, డైరెక్టర్‌ వెంకట్రావు, అడిషనల్‌ కమిషనర్‌ కృష్ణవేణి, ఉన్నతాధికారులు, ఈఓలు, సీజీఎఫ్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బడ్జెట్‌ అనుమతులు, సీజీఎఫ్‌ నిధుల కోసం వచ్చిన విజ్ఞప్తుల మీద అధికారులతో మంత్రి సమగ్రంగా చర్చించారు. రూ. 72.47 కోట్ల విలువైన 297 పనులకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ… సీజీఎఫ్‌ పనులపై క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం సరికాదన్నారు. స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధుల సూచనలనే పంపకుండా క్షేత్ర స్థాయిలో ఈఓలు పరిశీలించి, సరైన అంచనాలు వేయాలని సూచించారు. చిన్న చిన్న ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. టెంపుల్‌ టూరిజం సర్క్యూట్లపై మరింత కసరత్తు చేయాలని సూచించారు. ఒక జిల్లాలోని మూడు ప్రధాన ఆలయాలను కలిపి సర్య్కూట్‌గా ప్రణాళికలు రూపొందించి ముందుకెళ్లాలన్నారు. ప్రముఖ ఆలయాలకు భక్తులు, పర్యాటకులను రప్పించడంతో పాటు మార్గమధ్యంలో ఉన్న సందర్శక ప్రాంతాలు తిలకించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -