•జిల్లా విద్యాధికారి బి.బిక్షపతి
నవతెలంగాణ – మర్రిగూడ
రేపటి నుండి ఏప్రిల్ 16 వరకు జరగనున్న పదవ తరగతి పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పరీక్షలు ప్రశాంతంగా జరిగేటట్టు చూడాలని జిల్లా విద్యాధికారి బిక్షపతి అధికారులకు సూచించారు.శుక్రవారం మండల కేంద్రంలోని రెండు పరీక్ష కేంద్రాలైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,ఆదర్శ పాఠశాలను సందర్శించి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
వేసవికాలం దృష్ట్యా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని,మంచినీటి వసతి,ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందే రావాలని,హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని,సెల్ ఫోన్లు,ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకుండా పరీక్ష నియమాలను పాటిస్తూ ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు ఆయన దిశా నిర్దేశం చేశారు.ఆయన వెంట ఎంఈఓ శారద,చీఫ్ సూపరింటెండెంట్ రూప్ సింగ్,సిబ్బంది ఉన్నారు.



