నవతెలంగాణ పాశమైలారం: సంగారెడ్డి జిల్లా పాశమైలారం రసాయన పరిశ్రమ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రియాక్టర్ పేలడంతో ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ పలువురు కార్మికులు ఇంకా పరిశ్రమలోనే చిక్కుకున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. తమవారి ఆచూకీ చెప్పాలంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనాస్థలంలో కార్మికుల కుటుంబాల రోదనలు మిన్నంటుతున్నాయి. ఈ క్రమంలో పరిశ్రమలోకి చొచ్చుకెళ్లేందుకు కార్మికుల కుటుంబాలు యత్నించాయి. అయితే వారిని పరిశ్రమలోకి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కార్మికుల కుటుంబసభ్యులకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.
మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు అంటున్నారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 108 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం. తీవ్రంగా గాయపడినవారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
సోమవారం పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో పలువురికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిలో సంఘటన స్థలిలోనే ఐదుగురు మృతి చెందగా.. మరో 8 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ధాటికి కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు ఉత్పత్తి విభాగం ఉన్న భవనం కూలిపోగా.. మరో భవనం బీటలు వారింది.