నవతెలంగాణ-హైదరాబాద్ : జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఓ వినాయక విగ్రహల తయారీ కేంద్రంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. తోపుడు బండిపై తరలిస్తున్న వినాయకుడి భారీ ప్రతిమ హైటెన్షన్ విద్యుత్ తీగలను తాకడంతో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మరణించగా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. అల్వాల వినోద్(32) అనే వ్యక్తి కోరుట్ల శివారులో శ్రీ బాలాజీ వినాయక విగ్రహ తయారీ కేంద్రం నిర్వహిస్తున్నాడు. అయితే, ఆ కేంద్రంలో తయారైన వినాయకుడి భారీ ప్రతిమను.. వినోద్ మరో 9 మంది కూలీలు కలిసి తోపుడుబండిపై మరో షెడ్డుకు తరలించే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో విగ్రహం.. పైన ఉన్న 33/11 కేవీ లైన్కు తగిలింది. విగ్రహం తడిగా ఉండడంతో విద్యుత్ సరఫరా జరిగి బండిని తోస్తున్న వారంతా విద్యుదాఘాతానికి గురై ఒక్కసారిగా ఎగిరి పడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా.. విగ్రహ తయారీ కేంద్రం నిర్వాహకుడు వినోద్తోపాటు సాయికుమార్(29) అనే కూలీ మార్గమధ్యలో మరణించారు. మిగిలిన 8 మంది తీవ్రంగా గాయపడగా వారిలో ఆరుగురిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లోని ఆస్పత్రులకు తరలించారు.