పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ పోలీస్ గణేష్ విగ్రహ ప్రతిష్టాపన నుండి నిమజ్జనం వరకు నిర్వాహనకు సహకరించిన ప్రతి ఒక్కరికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు. కమిషనరేటు పరిధిలో నిజామాబాద్, ఆర్మూర్ మరియు బోధన్ డివిజన్ పరిధిలో గణేష్ విగ్రహ ప్రతీష్టాపన నుండి నిమజ్జనం వరకు పండుగ ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో ప్రజలందరూ జరుపుకోవడం జరిగిందన్నారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలో దాదాపు 6000 గణేష్ విగ్రహాలు ప్రతిష్టించడం జరిగింది. ప్రతిష్టాపన అనంతరం భక్తులందరూ సాంప్రదాయం ప్రకారం 9, 11 రోజుల పాటు మండపాలలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి తదుపరి నిమజ్జనం చేయడం జరిగింది. దీనికి అన్ని మతాల ప్రజలు స్వచ్చందంగా సహకరించుకొని జయప్రదం చేయడం జరిగింది. నిమజ్జనం కోసం ప్రత్యేకంగా బాసర బ్రిడ్జి వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు.
బాసర , ఉమ్మెడ ఇవి కాకుండా మిగితా చాలా ప్రదేశాలలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పటిష్టంగా ఏర్పాటు చేశారు. ఇట్టి వేడుకలు ప్రశాంత వాతావరణంలో గణేష్ విగ్రహాల ప్రతీష్టాపన, నిమజ్జనం వేడుకలు అన్నింటికి సార్వజనిక్ గణేష్ మండలి , విగ్రహ గణేష్ కమిటీలు , మజీద్ కమిటీలు, అన్నిమతాల ప్రజలు, ప్రతీ ఒక్కరు పోలీస్ శాఖకు సహకరించారు. అదే విధంగా వివిధ శాఖల అధికారులు / సిబ్బంది ప్రత్యేకంగా రెవెన్యూ శాఖ, గ్రామ పంచాయతి మున్సిపాలటి , అబ్కారీ శాఖ, ఫైర్ సర్వీస్ ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్, గజ ఈతగాళ్లు అందరూ వారి సేవలను అందించారు. పత్రిక ప్రతినిధులు ఎలక్ట్రానిక్ మీడియా / ప్రింట్ మీడియా సిబ్బంది అందరూ కూడా సహకరించారు. ఈ శుభ సందర్బంలో ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు.