కామ్రేడ్ సుగుణమ్మ… అత్యంత చిన్న వయసులోనే తెలంగాణ సాయుధపోరాటంలో భాగమయ్యారు. కొరియర్గా ఉంటూ అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. పీడిత జనుల కోసం ఐదేండ్లు రహస్య జీవితం గడిపారు. ఉన్నత కుటుంబంలో పుట్టినా కఠినమైన పేదరికం అనుభవించారు. ఉద్యమ విరమణ అనంతరం మహిళా సంఘాన్ని నిర్మించడంలో కీలకపాత్ర పోషించారు. తుది శ్వాస విడిచే వరకు తన ఉద్యమ స్ఫూర్తిని అలాగే కొనసాగించిన ఆ స్ఫూర్తి ప్రధాత
ఈ నెల 16న కన్నుమూశారు.
సుగుణమ్మది బ్రాహ్మణపల్లి గ్రామం. ప్రస్తుతం ఇది రంగారెడ్డి జిల్లాలో బీబీనగర్ మండలంలో ఉంది. తల్లి లక్ష్మమ్మ, తండ్రి రామచంద్రారెడ్డి. వీరికి ఐదుగురు సంతానం. తండ్రి పోలీస్ పటేల్. ఊర్లో వీరిదే పెత్తనం. అన్న కోదండ రామిరెడ్డి ప్రోత్సాహంతో సుగుణమ్మ ఉద్యమ బాట పట్టారు. ఆయన విద్యార్థి దశలోనే జాతీయోద్యమానికి ఆకర్షితుడయ్యాడు. ఇంట్లో ఘోషా పద్ధతిని మాన్పించి, చదువు మొదలైన విషయాలలో పెద్దలనెదిరించి చెల్లెళ్లను చదివించాడు.
అందరికంటే భిన్నంగా
తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొని పదిహేనేండ్లకే జైలుకు వెళ్లి ఖైదీల తరపున పోరాడిన కామ్రేడ్ శశిరేఖ సుగుణమ్మకు అక్క. అప్పట్లో సుగుణమ్మ అన్న ఊర్లో అందరి నుండి నిధులు సేకరించి ఒక పాఠశాల నిర్మించారు. అందు లోనే వీరు 6వ తరగతి వరకు చదువుకున్నారు. చదువుతో పాటు వ్యాయామం, కర్రసాము, సైకిల్ తొక్కడం, ఈత, గుర్రపుస్వారీ వంటివి నేర్చుకున్నారు. మిగిలిన ఆడపిల్లలకు భిన్నంగా నిక్కరు, షర్టు ధరించే వారు. అలంకారాలకు దూరంగా ఉండేవాళ్లు.
ఆరుట్ల కమలను చూసి…
ఆరోజుల్లో ఆరుట్ల కమలాదేవి పెండ్లి తర్వాత కూడా హాస్టల్లో ఉండి చదువుకుంటుందని, భర్తతో పాటు సమావేశాలకు వెళుతుందని విని ఆమెలా తను కూడా పని చేయాలని సుగుణమ్మ ఆరాటపడేవారు. ఒకసారి వీరి ఊరికి దగ్గరలోనే ఒక బహిరంగ సభకు కమలాదేవి వస్తున్నారని తెలిసింది. అన్నతో పాటు ఆమె కూడా వెళుతుంటే ఇంట్లో వీల్లేదని వారించారు. కోదండ రామిరెడ్డి ఎలాగో ఒప్పించి చెల్లెళ్ళిద్దరినీ ఆ మీటింగ్కి తీసుకెళ్ళాడు. అక్కడ మొదటి సారి ‘కష్టజీవి’ బుర్రకథ వినడం, కమలాదేవిని చూడడంతో ఆమె సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
ఆంధ్రమహాసభ ప్రభావంతో…
అప్పట్లో హైదరాబాద్ రాష్ట్రంలో ఉర్దూ అధికార భాషగా ఉండేది. ఇతర భాషలకు సంస్కృతులను అణచివేసేవారు. ప్రజల మాతృభాషల్లో విద్యా విధానం నిషేధం. పేదలు వెట్టి చేస్తూ దోపిడికి గురయ్యేవారు. వెట్టి పనులు చేయలేకపోతే పెత్తందార్లు, దొరలూ వాళ్ళను తీవ్రంగా హింసించే వారు. మహిళలను లైంగికంగా హింసించేవారు. ఆ పాలనపై ప్రతిఘటన మొదలైంది. చివరకు అది మరింత విస్తృతమైన ఆందోళనకు దారితీసింది. ఆంధ్రమహాసభ ఏర్పడిన తర్వాత రావి నారాయణరెడ్డి, కోదండ రామిరెడ్డి అందులో చేరారు. ఈ ప్రభావం సుగుణమ్మపై పడింది.
కొత్త ఉత్సాహం
సుగుణమ్మ, శశిరేఖ కలిసి ఇంట్లో వాళ్ళు చూడకుండా వడ్లు దంచిన వాళ్ళకు మంచి బియ్యం ఇచ్చి పంపేవారు. అలాగే ఇంట్లో నుండి కచ్చడంలో బయలు దేరినా పొలిమేర దాటిన వెంటనే దిగి నడిచేవాళ్లు. 1944లో భువనగిరిలో ఆంధ్ర మహాసభ పదకొండవ సమావేశం జరిగింది. ఈ సభలో సుగుణమ్మ కుటుంబం మొత్తం పాల్గొంది. అక్కడే ఈమె మొదటి సారి మల్లు స్వరాజ్యంను కలుసుకున్నారు. వాళ్ళతో పాటు వాలంటీరుగా పని చేశారు. అది ఆమెలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తర్వాత కాలంలో మల్లు స్వరాజ్యం, అరుట్ల కమలాదేవితో పాటు అనేక మంది మహిళలు దళాల్లో తుపాకి పట్టి పని చేస్తున్నారని తెలిసింది. ఆ దళాల్లో చేరి పని చేయాలనే కోరిక సుగుణమ్మలోనూ కలిగింది. కానీ తన మనసులోని మాటను పైకి చెప్పే ధైర్యం చేయలేకపోయారు.
అన్న జాడ చెప్పమంటూ…
సాయుధ పోరాటం ఊపందుకున్న తర్వాత రజాకార్ల దాడులు గ్రామాలపై ఎక్కువయ్యాయి. అన్న జాడ చెప్పమంటూ వీరి ఇంటిపై పోలీసులు ఎన్నో సార్లు దాడి చేశారు. దాడులు ఎక్కువ కావడంతో వీరంతా హైదరాబాద్ చేరుకున్నారు. వీళ్లు వచ్చేసిన తర్వాత వాళ్ల పాలేర్లతోనే వారి ఇంటిని తగలబెట్టించి తర్వాత వాళ్ళందరిని కూడా కాల్చి చంపారు. 1948లో రాజాకార్ల ఆగడాలు కాస్త తగ్గాయని తెలిసి తిరిగి గ్రామానికి వెళ్లారు. కాలిపోగా మిగిలిన ఇంటిని బాగు చేసుకుని అందులోనే ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ దాడులు మొదలుపెట్టారు. సుగుణమ్మ తండ్రిని, తల్లిని, అమ్మమ్మను విపరీతంగా కొట్టారు. దాంతో మళ్ళీ హైదరాబాద్ వచ్చి రహస్య జీవితం ప్రారంభించారు.
డెన్ జీవితం
హైదరాబాద్లో వీరి ఇల్లే ఓ డెన్లా ఉండేది. మహిళలకు ప్రత్యేకంగా రాజకీయ శిక్షణా తరగతులు పెట్టేవారు. 1949 జూన్ 6వ తేదీన కోదండ రామిరెడ్డిని సైనికులు కాల్చి చంపారు. ఆయన చివరి చూపు కూడా వీరికి దక్కలేదు. ఆయన మరణం కుటుంబాన్ని కుంగదీసింది. అప్పటికే తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీపై సైనిక చర్యలు తీవ్రమయ్యాయి. కొంత కాలం తర్వాత అక్క భర్త కాల్వ నారాయణరెడ్డి సుగుణమ్మను ఆయనతో పాటు తీసుకెళతా మన్నారు. కానీ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. పెండ్లి చేయాలనుకున్నారు. కానీ పార్టీలో పని చేస్తానని చెప్పి బావతో వెళ్లి డెన్ జీవితం గడిపారు. రావి నారాయణరెడ్డి, సీతాదేవి అక్కడ ఉండేవారు. మొదట్లో కాస్త భయపడ్డా మెల్లగా అలవాటు పడ్డారు. అక్కడ ఆమె పేరు ప్రమద. నారాయణరెడ్డి చూపిన అభిమానం కుటుంబాన్ని వదిలి వచ్చాననే బాధను ఆమెలో పోగొట్టింది. తర్వాత మరో రహస్య ప్రదేశానికి వెళ్ళారు. సుగుణమ్మ చేతిరాత చాలా బాగుండేది. స్పీడ్గా కూడా రాసేవారు. దాంతో ఆమెను ఈ పనికి కేటాయించారు. ఆమె పని విధానం నచ్చి పద్నాలుగేండ్లకే పార్టీ సభ్యత్వం ఇచ్చారు. ఇక ఆమె ఆనందానికి అవధుల్లేవు. పోరాట ప్రాంతాల నుండి వచ్చే రిపోర్టుల్లో మహిళలు నిర్వహిస్తున్న పాత్రను చూసి చాలా ఉత్సాహపడేవారు.
కొరియర్గా…
అన్న ప్రభావంతో ఎనిమిదేండ్ల వయసు నుండే సుగు ణమ్మ కొరియర్గా పని చేసేవారు. పోలీసులను తప్పించుకుని చాకచక్యంతో తన పని పూర్తి చేసేవారు. అయితే కొరియర్ పనంటే మొదట్లో చిన్నబుచ్చుకున్నారు. తుపాకీ పట్టి పోరాటం చేయడం గొప్పగా భావించేవారు. కానీ ఒక సందర్భంలో రావి నారాయణరెడ్డి ‘నువ్వు మంచి కొరియర్వి, చాలా పెద్ద బాధ్యత నిర్వర్తిస్తున్నావు’ అన్నారు. దాంతో తనకు ఇష్టం లేకపోయినా కొరియర్గా చేశారు.
ఉద్యమానికే అంకితం
సాయుధ పోరాట విరమణ తర్వాత అందరూ చెల్లాచెదురయ్యారు. దాంతో 1957లో మోటూరు ఉదయం ఎక్కడెక్కడో ఉన్న మహిళా కార్యకర్తలందరినీ వెదికి కమిటీ ఏర్పాటు చేశారు. అలా ఏడుగురితో హైదరాబాద్ సిటీ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సుగుణమ్మ అధ్యక్షు రాలు. రాష్ట్ర కమిటి, అలిండియా కమిటీలో కూడా పని చేశారు. అలాగే సారా ఉద్యమంలో బాగా పని చేశాం. అప్పట్లో 30 సంఘాలు కలిసి దీని కోసం ఓ కమిటీ ఏర్పాటు చేసుకు న్నారు. ఈ కమిటీకి రాష్ట్ర కమిటి కార్యదర్శిగా ఉన్నారు. ఆ సమయంలో చాలా మంది మహిళలు వీరితో కలిసి వచ్చారు. చివరకు సారాను నిషేధించారు. ట్రేడ్ యూనియన్ తో కూడా కలిసి పని చేశారు. ఐదు యూని యన్లకు ప్రెసిడెంట్గా ఉండేవారు. అలా తన సమయం మొత్తం పార్టీ కోసమే కేటాయించారు. చివరి దశలోనూ పని చేయాలనే కోరిక ఆమెలో బలంగా ఉండేది. అయితే తిరిగే ఓపిక లేక ఆగిపోయారు. దానికి ఆమె చాలా బాధపడేవారు. ప్రపంచ చరిత్రలో ఓ చారిత్రా త్మక విప్లవ ఘట్టమైన తెలంగాణ సాయుధ పోరాటంలో తన కుటుంబం మొత్తం భాగస్వామి అయినందుకు ఆమెంతో గర్వపడే వారు. తన చివరి దశలో సి.ఆర్. ఫౌండేషన్లో గడిపి తుదిశ్వాస విడిచారు.
డెన్లోనే పెండ్లి
సుగుణమ్మ డెన్లోనే యస్.వి.కె ఉండేవారు. వెళ్ళి ఏడాది దాటినా ఆయన అసలు పేరు ఆమెకు తెలియదు. ఆయన ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవారు కాదు. అయితే సుగుణమ్మను వివాహం చేసుకుంటానని ఉత్తరం ద్వారా తెలియజేశారు. అక్క, బావకు చెప్పి నారాయణరెడ్డిని సంప్రదించి డెన్లోనే వీరు పెండ్లి చేసు కున్నారు. 1951లో రహస్య జీవితంలోనే పాప శోభ పుట్టింది. అప్పుడు వీరి డెన్పై పోలీసులు నిఘా పెట్టారు. దాంతో పాపను తీసుకుని అనేక ప్రాంతాలు తిరిగారు. అదే సమయంలో యస్.వి.కెను అరెస్టు చేశారు. అది విని కుంగిపోయారు. తర్వాత ఆయన బతికే ఉన్నారని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయం లో ఐదేండ్లు రహస్య జీవితం గడిపారు.
మళ్లీ చదువు
పాపను తీసుకుని సుగుణమ్మ యస్.వి.కె ఊరైనా గుంటూరులో కొంత కాలం ఉన్నారు. అప్పు డే ఆమెకు మళ్లీ చదువుకోవాలనే ఆలోచన వచ్చింది. వైజాగ్ వెళ్ళి మెట్రిక్యులేషన్ పరీక్ష రాసి పాసయ్యారు. హిందీ విశారద కూడా రాశారు. అదే సమయంలో యస్.వి.కె విడుదలై కొంతకాలం హైదరాబాద్లో ఉండి వీరి వద్దకు వచ్చారు. సుగుణమ్మ ఉద్యోగం కోసం ప్రయత్నం చేద్దామనే సమయంలో ఉద్యమ అవసరాల రీత్యా వీరిని వరంగల్ పంపించారు. దాంతో ఆ ప్రయత్నం చేయలేకపోయారు. ప్రైవేటుగా బికాం పూర్తి చేశారు. పాప పుట్టిన ఎనిమిదేండ్లకు పెద్ద బాబు రవి, తర్వాత రమేష్ పుట్టారు. పిల్లలు చిన్నగా ఉండడంతో ఇక ఉద్యోగం చేసే అవకాశమే ఆమెకు రాలేదు.
– సలీమ