చిట్యాల ఐలమ్మ, మల్లు స్వరాజ్యం నుంచి నేటి వరకు…
వెట్టి, స్రీ విముక్తి, భూపోరాటాల చిత్రమాలిక
ఎస్వీకేలో ప్రారభించిన ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కొంగు నడుంకు కట్టి, కొడవళ్లు చేతబట్టి… వెట్టి, స్త్రీ విముక్తి, భూపోరాటాల నుంచి నేడు స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఫోటో ఎగ్జిబిషన్ ఆవిష్కరించింది. జనవరి 25 నుంచి 28 వరకు నాలుగు రోజుల పాటు హైదరాబాద్లోని ఆర్టీసీ కళ్యాణ మంటపంలో జరుగనున్న ఐద్వా 14వ జాతీయ మహాసభలను పురస్కరించుకుని శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే ప్రారంభించారు. ఆర్ట్ ఎగ్జిబిషన్ హాల్ను ఐద్వా కోశాధికారి ఎస్..పుణ్యవతి, సాయుధ పోరాటాల చిత్రమాలిక హాల్ను సుధా సింధూరన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలపై కొనసాగుతున్న వివక్ష, దాడులు, చట్టబద్దంగా వారికి రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధన, సుప్రీంకోర్టు నిర్దేశించిన సమాన పనికి సమాన వేతనం, వితంతు పెన్షన్లు, చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు తదితర అంశాలపై మహాసభలో చర్చించి తీర్మానాలు చేయనున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 33 శాతం మహిళా రిజర్వేషన్ చట్టం అమలులో ఘోరంగా విఫలమైందనీ, వెంటనే చట్ట సభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రం కల్పించాలన్నారు. బీజేపీ అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో, దేశంలో స్త్రీలపై సాంస్కృతిక దాడి ఎక్కువైందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల వస్త్ర ధారణ కేంద్రంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి టీచర్, రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్.అరుణ జ్యోతి, ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, సహాయ కార్యదర్శులు కె.ఎన్.ఆశాలత, బుగ్గవీటి సరళ తదితరులు పాల్గొన్నారు.



