– నియోజకవర్గంలో వినాయక పురం కేంద్రంగా మరో మండలం: ఎమ్మెల్యే జారె
నవతెలంగాణ – అశ్వారావుపేట
మహిళా అభ్యున్నతికి,వారి సాధికారతకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, ప్రతీ మహిళను కోటీశ్వరాలుని చేయడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం అని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. ఇందిర మహిళా శక్తి లో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం తరపున అందించే ఏకరూప చీరల పంపిణీ ని ఆదివారం మండలంలోని వినాయక పురం పంచాయితీ ప్రాంగణంలో లాంచనంగా ఆయన ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి వారి కుటుంబాల ఆర్థిక స్థిరత్వానికి మహిళా సంఘాలు ఎంతగానో తోడ్పడుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం తీసుకొస్తున్న అనే సంక్షేమ పథకాలను వివరించారు.అన్ని రంగాలలో మహిళలు మరింతగా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్నదే తన సంకల్పమని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం,విద్యుత్ ,సన్నబియ్యం,వడ్డీ లేని రుణాలు,నాణ్యమైన చీరలు మహిళలకు ప్రత్యక్ష లాభం చేకూరే అవకాశం ఉందని అన్నారు. అశ్వారావుపేట నియోజక వర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటు వినాయక పురం మండల కేంద్రంగా మరో మండలాన్ని ఏర్పాటు చేస్తానని అన్నారు.
మండల సమాఖ్య అధ్యక్షురాలు కే.సౌజన్య,సెర్ప్ ఏపీఎం దేవమణి,అశ్వారావుపేట ఆత్మ – బీఎఫ్ఏసీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు,దమ్మపేట మార్కేట్ కమిటీ చైర్మన్ వాసం రాణి,అశ్వారావుపేట పాక్స్ చైర్మన్ చిన్నంశెట్టి సత్యనారాయణ,చిలకలగండి ముత్యాలమ్మ దేవాలయం చైర్మన్ నరాల శ్రీను,పంచాయితీ కార్యదర్శి బంగారు సందీప్,సెర్ప్ సీసీ జే.శ్రీనివోసరావు,కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్, తుమ్మ రాంబాబు లు పాల్గొన్నారు.



