– భారీ వర్షాలనూ తట్టుకునేలా వ్యవస్థల ప్రక్షాళన, ప్రత్యేక ప్రణాళికలు
– హైదరాబాద్లో వరద నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి
– తాగునీటితోపాటు డ్రయినేజీ, ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారానికి ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలో రాబోయే వందేండ్లపాటు వరద నీటి సమస్య పునరావృతం కాకుండా ఉండాలంటే మూసీ పునరుజ్జీవనమే ప్రత్యామ్నాయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు. సంబంధిత ప్రాజెక్టును వరద నీటి నిర్వహణకు వీలుగా డిజైన్ చేయాలని, ఆ దిశగా పనులు చేపట్టాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. నగరంలో ఎంతటి భారీ వర్షాలు కురిసినా తట్టుకునేందుకు వీలుగా వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయాలని సూచించారు. వరద నీటి ప్రవాహనికి ఉన్న అడ్డంకులను అధిగమించటంతో పాటు భవిష్యత్ తరాలకు ఉపయోగపడేందుకు వీలుగా పనులను చేపట్టాలని కోరారు. వర్షాలతో నగరం అతలాకుతలం కాకుండా, జనజీవనం అస్తవ్యస్తం కాకుండా ఉండాలంటే.. శాశ్వత అభివృద్ధి పనులను అత్యవసరంగా చేపట్టాల్సిన అవసరముందని తెలిపారు. తాగునీరు, వరద నీరు, డ్రైనేజీలు, ట్రాఫిక్ వ్యవస్థలకు సంబంధించి మరో వందేళ్ల అవసరాలను అంచనా వేసుకుని కొత్త ప్రణాళికలను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
ఢిల్లీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకున్న ముఖ్యమంత్రి గురువారం రాత్రి హైదరాబాద్లో కురిసిన వర్షం, తలెత్తిన ఇబ్బందులు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అన్ని విభాగాల అధికారుల అభిప్రాయాలను ఆయన ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకున్నారు. గురువారం రాత్రి నగరంలో అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో ట్రాఫిక్ స్థంభించటంతోపాటు లోతట్టు ప్రాంతాల్లో వరద నీటితో ముంపు పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.
భారీ వర్షం ఒకేసారి కురవటంతో విపత్కర పరిస్థితులు తలెత్తుతున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడటంతో జనజీవనం అస్తవ్యస్తమవు తోంది. సాధారణంగా మూడు నాలుగు నెలల్లో కురిసే వర్షపాతం మొత్తం ఒకే రోజున కుమ్మరించటంతో నగరం అతలాకుతలమవుతోందని సీఎంకు అధికారులు వివరించారు. వాతావరణ మార్పులే అందుకు ప్రధాన కారణమని, అందుకు తగినట్టుగా నగరంలో అన్ని వ్యవస్థలను ఆధునీకరిం చాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో ఇప్పుడున్న రోడ్లు, డ్రైనేజీలు అయిదు సెంటీమీటర్ల వర్షం పడ్డా తట్టుకునే పరిస్థితి లేదని తెలిపారు. కానీ ఒక్కోసారి 20 సెంటీమీటర్ల వర్షం నమోదవు తోందని అన్నారు.
హైదరాబాద్లో గురువారం కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే కొన్ని ప్రాంతాల్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. జూన్ నుంచి ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధిలో సాధారణంతో పోలిస్తే 16 శాతం వర్షపాతం ఎక్కువగా నమో దైంది. అందుకే వాతావరణ మార్పులు, భారీ వర్షాల తో తలెత్తే ఈ విపత్కర పరిస్థితులను అధిగమించేం దుకు విపత్తుల నివారణ, నిర్వహణ ప్రణాళికను సమర్థవంతంగా అనుసరించాలని సీఎం ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎంత వర్షం పడినా వర్షపు నీరు నిల్వ ఉండకుండా, వరద నీటితో ముంపు గురవకుండా, లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా సురక్షితంగా ఉండేలా అత్యంత పకడ్బందీ విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అందుకు వీలుగా రూపొందిస్తున్న మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని ఆదేశించారు. హైదరాబాద్లో 55 కిలోమీటర్ల పొడవునా మూసీని పునరుద్ధరించటం ద్వారా దాని పరివాహక ప్రాంతంతోపాటు నగరంలో ఉన్న అన్ని ప్రాంతాలు, కాలనీలన్నీ సురక్షితంగా ఉంటాయి, లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురవకుండా ఉంటాయని దిశా నిర్దేశం చేశారు. వరదనీటి ప్రవాహానికి అడ్డంకులు ఉన్నందువల్లే నగరంలో ఈ దుస్థితి తలెత్తుతోందని అధికారులు అభిప్రాయ పడ్డారు.
ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్లోని వరదనీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా నగరంలోని అన్ని వైపుల నుంచి వరద నీరు మూసీకి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నగరంలో ఉన్న హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు, మీర్ అలం చెరువులపాటు ప్రతీ చెరువు, కుంటలను నాలాల ద్వారా మూసీకి అనుసంధానం చేయాలని సూచించారు. చెరువుల పునరుద్ధరణ, నాలాల వెడల్పు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. డ్రైనేజీల ద్వారా వచ్చే నీటిని ఎస్టీపీ (సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల) ద్వారా శుద్ధి చేసి మూసీలో స్వచ్ఛమైన నీటి ప్రవాహం ఉండేందుకు వీలుగా పనులు చేపట్టాలని కోరారు. నగరంలో ఎక్కడ వర్షం పడినా నీరు చెరువుల్లోకి, నాలాల్లోకి, అక్కడి నుంచి మూసీలోకి చేరేలా అనుసంధానం చేయాలని సూచించారు. మూసీలో స్వచ్ఛమైన నీటి ప్రవాహంతో హైదరాబాద్లో నీటి కష్టాలు తీరుతాయని సీఎం అన్నారు. కలుషితమైన నీటితో మూసీ పరివాహక ప్రాంతంలో రైతులు పంటలు పండిస్తున్నారని, దీంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని తెలిపారు. ఇకపై ఈ పరిస్థితి తలెత్తకుండా మూసీలో నిరంతరం శుద్ధి చేసిన నీటి ప్రవాహం ఉండేలా శాశ్వత ప్రణాళికలు ఉండాలని సూచించారు. శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలు, ఇతర అవసరాలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా వినియోగించుకునే వీలుంటుందని వివరించారు.
ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలి
హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. వర్షాలు, వరదల సమయంలో ట్రాఫిక్ సమస్య మరింత పెరుగుతోందనీ, దీనికి శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పాతనగరంలో ఈ సమస్యను పరిష్కరించేందుకు పెడిస్ట్రియల్ జోన్ను ఏర్పాటు చేసి పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టాలని సూచించారు. చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం, హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి ప్రాంతాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ జోన్లను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
వాటి ఏర్పాటుతో రోడ్లపై వాహనాల రద్దీని తగ్గించడంతోపాటు పార్కింగ్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, హెచ్ఎండీఏ పరిధిలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ ఇలంబర్తి, ఎమ్ఆర్డీసీఎల్ ఎమ్డీ ఈవీ నర్సింహారెడ్డి, జేఎమ్డీ గౌతమి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మూసీ పునరుజ్జీవమే ప్రత్యామ్నాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES