Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఏపీ ప్రభుత్వం బాధ్యతగా స్పందించాలి

ఏపీ ప్రభుత్వం బాధ్యతగా స్పందించాలి

- Advertisement -

లేకుంటే ఉద్యమం ఉధృతం
పోలవరం ముంపు ప్రాంతాల్లో సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి ఎంఏ బేబీ, ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ పర్యటన
రాజమహేంద్రవరం :
పోలవరం ముంపు ప్రజల కోసం నిర్మించిన పునరావాస కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవనీ, తక్షణమే చర్యలు చేపట్టాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ.బేబీ డిమాండ్‌ చేశారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోతే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఏపీలోని పోలవరం ముంపు ప్రాంతాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ, రాజ్యసభ సీపీఐ(ఎం) ఫ్లోర్‌లీడర్‌ జాన్‌ బ్రిట్టాస్‌ పర్యటించారు. శనివారం రాజమహేంద్రవరం విమానాశ్రయానికి ఎంఎ బేబీ చేరుకున్నారు. ఆయనతోపాటు రాజ్యసభ ఫ్లోర్‌ లీడర్‌ జాన్‌ బ్రిట్టాస్‌ కూడా వేర్వేరు మార్గాలలో పోలవరం ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను కలిశారు. తాళ్లూరు, నాగులపల్లి పునరావాస కాలనీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో ఎంఎ. బేబీ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు కారణంగా వేలాది కుటుంబాలు మునిగిపోతున్నాయన్నారు. నిర్వాసితుల్లో 85 శాతం మంది ఆదివాసీలు ఉన్నారని తెలిపారు. పోలవరం నిర్వాసితులందరికీ గౌరవప్రదమైన పునరావాసం కల్పించాల్సిన బాధ్యత పాలక చంద్రబాబు ప్రభుత్వంపై ఉందని, కానీ సుదీర్ఘకాలంగా పూర్తి నిర్లక్ష్యం జరిగినట్టు స్పష్టమవుతోందని అన్నారు. నిర్మాణాల్లో నాణ్యతా లోపం కారణంగా వర్షాలకు స్లాబులు నుంచి నీళ్లు కారుతున్నాయని, మరుగుదొడ్లు కూడా సక్రమంగా నిర్మించలేదని, తాగునీటి సౌకర్యం కూడా పూర్తిస్థాయిలో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారని తెలిపారు. ఉపాధి కోసం ప్రతిరోజు 30 నుంచి 40 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సిన దుస్థితి ఇక్కడి ప్రజలకు నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించినప్పటికీ పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదని అన్నారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ, పునరావాస గృహాలకు అర్హులైనవారు సైతం దూరమయ్యారని వివరించారు. వీటన్నిటినీ ఇప్పటికే సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కమిటీ ఆందోళన రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిందనీ, ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు.
అనంతరం సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథం మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టంను అమలు చేయడంలో రాష్ట్రంలో మోడీ, చంద్రబాబు ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.55 వేల కోట్లు కాగా, ప్రజల పునరావాసానికి రూ.33 వేల కోట్లు
ఖర్చు చేయాల్సింది ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజలకు పూర్తిస్థాయిలో మౌలిక వసతులతో కూడిన పునరావాసం కల్పించాల్సిన బాధ్యతను గత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు . తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిర్వాసితుల సమస్యలను పరిశీలిస్తామని ఇచ్చిన హామీని విస్మరించిం దన్నారు. ప్రజల సమస్యలు విన్నవించుకునేందుకు నోడల్‌ అధికారి సైతం అందుబాటులో లేరని చెప్పారు. ఈ నేపథ్యంలో పోలవరం నిర్వాసితులు జీవచ్ఛవాల్లా బతుకుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. పాలక ప్రభుత్వాలు తక్షణమే స్పందించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తారని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సురేంద్ర, అల్లూరి సీతారామరాజు జిల్లా సీపీఐ(ఎం) కార్యదర్శి బి.కిరణ్‌, తూర్పుగోదావరి జిల్లా సీపీఐ(ఎం) కార్యదర్శి టి.అరుణ్‌, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సభ్యులు లోతా.రామారావు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad