10 మంది సైనికులు మృతి
జమ్మూకాశ్మీర్ దోడా జిల్లా ఖన్నీ టాప్ వద్ద ప్రమాదం
దోడా: జమ్మూకాశ్మీర్ దోడా జిల్లాలో ఓ ఆర్మీ వాహనం లోయలో పడి 10మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. భదర్వ-చంబా అంతర్రాష్ట్ర రహదారిలోని ఖన్నీ టాప్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆర్మీకి చెందిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం అదుపు తప్పి 200 అడుగుల లోతు ఉన్న లోయలో పడింది. ప్రమాద సమాచారం అందుకున్న ఆర్మీ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం వీరిని ఉధంపూర్ మిలిటరీ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. ప్రమాద సమయంలో వాహనంలో 17 మంది సైనికులు ఉన్నారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. మంచు ఎక్కువగా కురుస్తుండటంతో రోడ్డును అంచనా వేయలేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్టు అధికారులు భావిస్తున్నారు.
ప్రమాదంపై లెఫ్టినెంట్ గవర్నర్, సీఎం సంతాపం
ప్రమాదంపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన సీఎం అబ్దుల్లా, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ”దోడా జిల్లాలో జరిగిన ప్రమాదంలో 10 మంది సైనికులు వీరమరణం పొందడం విచారకరం. దేశానికి వారు చేసిన సేవలను, త్యాగాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాం. వీరమరణం పొందిన కుటుంసభ్యులకు నా ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు.



