నేడు కృష్ణా, గోదావరిపై పవర్పాయింట్ ప్రజెంటేషన్
2న ఉపాధి హామీపై సభలో లఘు చర్చ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అసెంబ్లీ సమావేశాలు జనవరి 6 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ అంశంపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ)లో స్పష్టత రాలేదు. బీఏసీ సమావేశం అనంతరం బిజినెస్కు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేస్తారు. అందుకు భిన్నంగా ఈసారి ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. దాంతో ఎన్ని రోజులు నిర్వహిస్తారనే అంశంపై సర్కార్ తీసుకునే నిర్ణయమే ఫైనల్ కానుంది. అధికారులు చెబుతున్న సమాచారం ప్రకారం జనవరి 6 లేదా 7 వరకు సమావేశాలు నడపనున్నట్టు తెలుస్తోంది. జనవరి 2న ఉపాది హామీపై సభలో లఘు చర్చ జరగనుంది. మహాత్మాగాంధీ ఉపాధి హమీ స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన వీబీ జీ రామ్ జీ స్కీం వల్ల తెలంగాణ ఏటా రూ.1,200 కోట్లు నష్టపోనుంది. అలాగే కార్మికుల పనిదినాలు, వేతనాలు, ఇతర అంశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. వీబీ జీ రామ్ జీ స్కీంను రద్దు చేసి పాత చట్టానే కొనసాగించాలని అసెబ్లీలో తీర్మానం చేయనున్నట్టు సమాచారం.
ఈ అంశంపై బీజేపీ మినహా అన్ని పార్టీల సభ్యులు అంగీకారం తెల్పే అవకాశం ఉంది. జనవరి 4న ఆదివారం కావడంతో సభ జరిగే అవకాశాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో 3న గోదావరి, 5న కృష్ణా జలాలపై సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. తెలంగాణ నీటి వాటాల విషయంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న క్రమంలో ఏర్పాటు చేసిన శాసనసభా సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పాలమూరు-రంగారెడ్డి, పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్ట్లపై క్యూసెక్కులు, టీఎంసీలు, అంకెలు, సంఖ్యలతో రెండు పార్టీలు అసెంబ్లీ వేదికగా నీళ్ల యుధ్దానికి సిద్ధమవుతున్నాయి. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి నేడు ప్రజాభవన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.



