Wednesday, January 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె సక్సెస్‌

బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె సక్సెస్‌

- Advertisement -

నిరసన ర్యాలీలు వారానికి ఐదురోజుల పని
శని, ఆదివారం సెలవుకు డిమాండ్‌
రాష్ట్రవ్యాప్తంగా స్తంభించిన బ్యాంకింగ్‌ సేవలు
నవతెలంగాణ- విలేకరులు

బ్యాంకింగ్‌ రంగంలో వారానికి ఐదు రోజులే పని ఉండాలని.. శని, ఆదివారాలు సెలవు ఇవ్వాలన్న డిమాండ్‌తో యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్‌ పిలుపు మేరకు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరిగింది. బ్యాంకులు మూతపడటంతో సేవలు నిలిచిపోయాయి. హైదరాబాద్‌లో ఉద్యోగులు సమ్మె చేయడంతో బ్యాంకులన్నీ మూతపడ్డాయి. పెద్దపలి జిల్లా గోదావరిఖనిలో బ్యాంకుల ఉద్యోగులు నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక మున్సిపల్‌ ఆఫీస్‌ చౌరస్తా నుంచి ప్రధాన చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మెకు సీఐటీయూ జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే ఇన్సూరెన్స్‌ రంగంలో, సాఫ్ట్‌వేర్‌ రంగంలో అభివృద్ధి చెందిన దేశాల్లో వారానికి ఐదు రోజుల పని విధానం నడుస్తోందని అన్నారు. బ్యాంక్‌ ఉద్యోగులకు శని, ఆదివారాలు సెలవు ప్రకటించాలన్నారు. ఎస్‌బీఐ ఖమ్మం మెయిన్‌ బ్రాంచ్‌ ముందు ఉద్యోగులు నిరసన తెలియజేశారు. ముందుగా ఉద్యోగులందరూ మెయిన్‌ బ్రాంచ్‌ నుంచి యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌ ఓల్డ్‌ కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. తిరిగి అక్కడి నుంచి ర్యాలీగా ఖమ్మం మెయిన్‌ బ్రాంచ్‌కు వచ్చారు. బ్యాంకులు తెరుచుకోకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులుపడ్డారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు బ్యాంక్‌ మూసేసి ఉండటంతో తిరిగి వెళ్లారు. భద్రాద్రి కొత్తగూడెం జిలాల్లో కొత్తగూడెం పట్టణంలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపం ఎదుట సమ్మె నిర్వహించారు. బ్యాంకులు మూత పడ్డాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో ఎస్‌బీఐ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంకు ముందు మెయిన్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ సుబ్బారావు ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -