Monday, June 2, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఆరంభ శూరత్వం..!

ఆరంభ శూరత్వం..!

- Advertisement -

– ఆగిన పీఎం స్వనిధి రుణాలు ఆర్నెల్లుగా రుణాలివ్వని బ్యాంకర్లు
– 2024 డిసెంబర్‌ 31తో ముగిసిన పథకం గడువు
– కొనసాగిస్తామన్న ఆర్థిక మంత్రి నిర్మల
– 2025 కేంద్ర బడ్జెట్‌లో వెల్లడి..ఆదేశాలు లేవంటున్న బ్యాంకర్లు
– ఆర్థిక సాయం కోసం చిరు వ్యాపారుల ఎదురుచూపులు
– ఫుట్‌పాత్‌ వ్యాపారాలకు చేయూత కరువు
నవతెలంగాణ- మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి

ప్రధానమంత్రి స్వనిధి పథకం ఆరంభ శూరత్వంగా మారింది. పట్టణ ప్రాంతాల్లో పుట్‌పాత్‌లపైన చిరు వ్యాపారాలు చేసుకునే పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు చేయూత అందించాలన్న లక్ష్యంతో అమలు చేసిన ప్రధాన మంత్రి స్వనిధి పథకం ఆగిపోయింది. ఆర్నెళ్లుగా బ్యాంకుల నుంచి రుణాల మంజూరీ ప్రక్రియ పూర్తిగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం పథకం అమలు గడువును పెంచకపోవడం వల్లనే రుణాలివ్వడం నిలిపేశామని బ్యాంకర్లు, మెప్మా అధికారులు చెబుతున్నారు. పీఎం స్వనిధి పథకం ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారులందరూ క్రమంగా తిరిగి చెల్లించారు. కానీ..! కేంద్ర ప్రభుత్వమే పథకాన్ని అమలు చేయట్లేదు. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ 2025 బడ్జెట్‌ ప్రసంగంలో పీఎం స్వనిధి పథకాన్ని కొనసాగిస్తామని ప్రకటించినా ఇప్పటి వరకు అమలుకు నోచట్లేదు. ఆర్థిక సాయం అందకపోవడంతో పట్టణాల్లో చిరు వ్యాపారాలు అనుకున్నంతగా సాగట్లేదు. 2019 కోవిడ్‌ సమయంలో గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2020 జూన్‌ 1న ప్రధాన మంత్రి స్వనిధి పథకాన్ని ప్రారంభించింది. వీధి వ్యాపారులకు సబ్సిడీ రేటుతో ఆర్థిక సాయం అందించడం ఈ పథకం ముఖ్య లక్ష్యంగా అధికారులు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో పుట్‌పాత్‌లపైన చిరు వ్యాపారాలు చేసుకుని కుటుంబాల్ని పోషించుకునే వాళ్లకు స్థానిక బ్యాంకు ద్వారా రూ.10 వేల రుణమిస్తారు. అట్టి సొమ్మును తిరిగి చెల్లించాలి. తిరిగి రూ.20 వేల రుణమిస్తారు. అది కూడా తిరిగి చెల్లించిన లబ్ధిదారులకు రూ.50 వేల రుణాన్ని మంజూరు చేస్తారు. అలా రుణ మొత్తాన్ని పెంచుకుంటూ పోతారు. ఈ పథకంలో రుణాన్ని క్రమం తప్పకుండా తిరిగి చెల్లించే వారికి ఏడాదికి 7 శాతం వడ్డీ సబ్సిడీని అందిస్తారు. డిజిటల్‌ లావాదేవీలు చేసే వారికి సైతం ఏడాదికి రూ.1200 క్యాష్‌ బ్యాక్‌ను అందిస్తారు. పట్టణ ప్రాంతాల్లోని చిరువ్యాపారులకు ఆర్థిక భరోసా ఇచ్చే విధంగా ఉండడంతో తొలుత ఎక్కువ మంది రుణాలు పొందారు. ప్రయివేట్‌ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీలు చెల్లించి నష్టపోయేవారికి పీఎం స్వనిధి పథకం కొంత ఊరటనిచ్చినప్పటికీ అది ఎంతో కాలం మిగలలేదని లబ్దిదారులు అంటున్నారు.
పీఎం స్వనిధి పథకం ఆరంభ శూనత్వం
పథకం ప్రారంభించిన మొదట్లో చిరు వ్యాపారులకు తొలుత ఇచ్చే రుణాలందాయి. ఆ తర్వాత కొద్ది మందికే అందాయి. రుణ మొత్తం పెరిగే క్రమంలో లబ్ధిదారుల్ని తగ్గిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఏకంగా పథకానికే విరామం ప్రకటించింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పీఎం స్వనిధి పథకం అమలు తీరును పరిశీలిస్తే… సంగారెడ్డి జిల్లాలో 8 మున్సిపాలిటీలున్నాయి. వీటిల్లో పుట్‌పాత్‌పై చిరు వ్యాపారాలు చేసుకునే కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. బ్యాంకుల ద్వారా కొద్ది మందికే రుణాలిచ్చారు. జిల్లా వ్యాప్తంగా 8 మున్సిపాలిటీల్లో 15607 మందికి రూ.10 వేల రుణాలిచ్చారు. లబ్ధిదారులు రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించినా రూ.20 వేల రుణం మాత్రం కేవలం 7685 మందికే ఇచ్చారు. అట్టి రుణాన్ని కూడా తిరిగి చెల్లించిన లబ్ధిదారుల్లో రూ.50 వేల రుణం మాత్రం కేవలం 2724 మందికే ఇచ్చారు. సిద్దిపేట జిల్లాలో 5 మున్సిపాలిటీలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 12602 మంది చిరు వ్యాపారులకు రూ.10 వేల చొప్పున రుణాలిచ్చారు. వారంతా రుణమొత్తాన్ని తిరిగి చెల్లించినప్పటికీ అందులో సగం అంటే 6429 మందికే రూ.20 వేల రుణాలిచ్చారు. వాళ్లంతా కూడా తీసుకున్న రుణాన్ని పూర్తిగా చెల్లించినప్పటికీ 2175 మందికి మాత్రమే రూ.50 వేల రుణాలిచ్చారు. మెదక్‌ జిల్లాలో 4 మున్సిపాలిటీలున్నాయి. జిల్లాలో 10 వేల మందికి రూ.10 వేల చొప్పున రుణాలిచ్చారు. అందులో 5200 మందికే రూ.20 వేల రుణాలిచ్చారు. చివరిగా రూ.50 వేల రుణం మాత్రం 1700 మందికి మాత్రమే మంజూరు చేశారు.
ఆచరణకు నోచని కేంద్ర మంత్రి మాట
పీఎం స్వనిధి పథకాన్ని కొనసాగిస్తామని బడ్జెట్‌ సమావేశాల్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించినా దానికి సంబంధించి అధికారికంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలూ జారీ చేయలేదు. దీంతో బ్యాంకర్లు, మెప్మా అధికారులు పీఎం స్వనిధి పథకం కింద చిరు వ్యాపారులకు కొత్తగా రుణాలివ్వడం ఆపేశారు. 2025 కేంద్ర బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఆర్థిక మంత్రి మాట్లాడుతూ పధకాన్ని కొనసాగిస్తామని తెలిపారు. పీఎం స్వనిధి పథకంలో గతంలో కోట్లాది మంది వీధి వ్యాపారులకు రుణాలిచ్చామని పేర్కొన్నారు. ఇంతటి మేలు చేకూరే పథకాన్ని తిరిగి ఎందుకు కొనసాగించట్లేదో, ఎందుకు నిధులు ఇవ్వడం లేదో కేంద్రమంత్రులు చెప్పలేకపోతున్నారు.
చతికిల బడ్డ చిరు వ్యాపారాలు
ఆర్థిక సాయం అందకపోవడంతో వ్యాపారాలు చతికిల పడుతున్నాయి. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, పూల వ్యాపారం, ప్లాస్టిక్‌ సమాన్లు, స్టీల్‌ సామాన్లు, రెడీమెడ్‌ డ్రెస్సులు, చెప్పులు, కిరాణ వస్తువులు, ఉల్లిగడ్డ, పండ్ల రసాలు, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల రిపేర్లు ఇతర చిరు వ్యాపారాలు చేస్తూ లక్షలాది మంది జీవిస్తున్నారు. మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర సామాజిక వర్గాలకు చెందిన వాళ్లే ఎక్కువ మంది పుట్‌పాత్‌లపైన చిరు వ్యాపారాలు చేస్తున్నారు. ఇప్పుడు పథకం ఆగిపోవడంతో ఎలాంటి స్థిర, చరాస్తుల్లేక వ్యాపారం కోసం వడ్డీ వ్యాపారుల నుండి పేదలు అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకుం టున్నారు. వచ్చిన సొమ్మంతా వడ్డీ వ్యాపారులకే తిరిగి చెల్లించాల్సి వస్తుండడంతో వ్యాపారాలు చేయలేక పోతున్నామని పలువురు చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రుణాలు ఆగింది నిజమే:మల్లేశ్వరీ, డీపీఎం, మెప్మా, సంగారెడ్డి
పీఎం స్వనిధి రుణ వాయిదాల గడువు ముగిసినందున రుణాల మంజూరీ ప్రక్రియ ఆగింది. కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని రూపొందించే వరకు రుణాలివ్వడం వీలుకాదు. త్వరలోనే కొత్త పథకం వస్తదని తెలుస్తుంది.
పీఎం స్వనిధి రుణాలివ్వాలి : హనుమంతు, వీధి వ్యాపారి-సంగారెడ్డి
పేదలకు ప్రధాన మంత్రి స్వనిధి రుణాలివ్వాలి. తొలుత రూ.10 వేల రుణాన్ని ఎక్కువ మందికి ఇచ్చారు. తిరిగి రుణం చెల్లించినా కొంత మందికే ఎక్కువ రుణమిచ్చారు. దశల వారీగా రుణాలిస్తామని చెప్పి మధ్యలో ఆపేయడం వల్ల నష్ట పోవాల్సి వస్తోంది. అధిక వడ్లీకు అప్పులు తెచ్చుకోవడం వల్ల నష్టమొస్తుంది. కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ద్వారా రుణాలిచ్చే పథకాన్ని కొనసాగించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -