–వ్యవసాయ, గ్రామీణ కార్మికుల అఖిల భారత వేదిక పిలుపు
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని, దాని మిత్రపక్షాలను ఓడించాలని వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘాల అఖిల భారత వేదిక పిలుపునిచ్చింది. శనివారం వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘాల నేతలు సమావేశమయ్యారు. బి.వెంకట్ (ఏఐఏడబ్ల్యూయూ), గుల్జార్ సింగ్ గారియా (బీఐఎంయూ), ధీరేంద్ర ఝా (ఏఐఏఆర్ఎల్ఏ), ఆశిష్ గంగూలీ (ఏఐఎస్కే ఎస్), దేవేంద్ర (ఏఐఏకేఎస్ యూ) ప్రకటన విడుదల చేశారు. ”ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అధికారంలోకి రావడం ప్రమాదకరం. కమలంపార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే కమ్యూనల్ రాజకీయాలు తీవ్రమవుతాయి. ప్రజల సంక్షేమ విధానాలు ఇంకా క్షీణిస్తాయి. ఇప్పటికే దేశవాప్తంగా బీజేపీ అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, చట్టాలు ప్రజల జీవన పరిస్థితులను మరింత దుర్భరంగా మారుస్తున్నాయి. గతేడాదిలోనే లేబర్ కోడ్ల అమలు నోటీసులు జారీ చేయడంతో పాటు ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తూ, దాని స్థానంలో వీబీజీఆర్ఏఏంజీని ప్రవేశపెట్టింది.
ఈ రెండు చట్టాలు కార్మికులు పోరాటాలతో సాధించుకున్న హక్కులు, హామీలను పూర్తిగా తొలగించేందుకు తీసుకువచ్చారు. భారత కార్మిక వర్గంలో వ్యవసాయ, గ్రామీణ కార్మికులు అత్యంత అస్థిర పరిస్థితుల్లో ఉన్నారు. వ్యవసాయ రంగంలో ఉపాధి చాలా భాగం అసంఘటితంగా ఉండటం వల్ల స్థిరమైన ఉపాధి హామీలు పొందడం కష్టం. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ ఒక జీవనా ధారంగా పనిచేసి, గ్రామీణ కార్మికుల పరిస్థితుల్లో గణనీయమైన మార్పు తీసుకువచ్చింది. ప్రతి కుటుంబానికి కనీసం 100 రోజుల పని హామీతో పాటు, ఏడాది పొడవునా నిర్దిష్ట వేతనాన్ని కల్పించింది. కానీ ప్రస్తుత బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం దీన్ని ఈ హామీని కూడా గ్రామీణ కార్మికుల నుంచి లాక్కుంది. గతంలో తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రైతుల పోరాట ఫలితంగా కేంద్రం వెనక్కి తీసుకోవాల్సి వచ్చినప్పటికీ, ఇప్పుడు మళ్లీ రైతులకు వ్యతిరేకంగా విత్తన బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు – 2025లను ప్రవేశపెట్టటంతో పేద రైతులపై నేరుగా పెట్టుబడి ఖర్చులను పెంచే విధంగా ప్రభావితం చేస్తాయన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి
- Advertisement -
- Advertisement -



