రెండ్రోజులు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు పొడిగింపు
మహిళా రిజర్వేషన్లు, నియోజవర్గాల పునర్విభజన బిల్లుపెట్టే యోచన
న్యూఢిల్లీ : ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక నాటకానికి తెరతీయడం బీజేపీకి అలవాటుగా మారింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. వీటిని దృష్టిలోపెట్టుకొని బీజేపీ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటుచేసింది. మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ, నియోజకవర్గాల పునర్విభజన చట్ట సవరణ బిల్లుల్ని ఈ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. దానికోసం ఈ నెల 2న ముగియాల్సిన పార్లమెంటు బడ్జెట్ సెషన్ రెండో విడత సమావేశాలను కొనసాగిస్తూ..ఈ నెల 16కు వాయిదా వేశారు.
నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న తరుణంలో కేంద్రం హడావిడిగా ఈ బిల్లులు పెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ‘నారీ శక్తి వందన్ అభియాన్’ (మహిళా రిజర్వేషన్ల బిల్లు)ను ఆమోదించి 30 నెలలు గడుస్తున్నా, సైలెంట్గా ఉన్న కేంద్రం, ఇప్పుడు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందటం కోసం తాపత్రయ పడుతోంది. నియోజకవర్గాల పునర్విభజనపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదా ప్రతిపాదన అందలేదని, కానీ లోక్సభ సీట్లు పెంచాలని యోచిస్తున్నట్టు కేంద్రం లీకులు ఇచ్చింది. ప్రతిపాదిత బిల్లుతో యూపీ బలం 120కి పెరగ్గా, కేరళం గరిష్టంగా 30 వరకు మాత్రమే చేరుకోగలదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు.



