– దలాల్ స్ట్రీట్పై మళ్లీ బేర్ పంజా
– రూ.6 లక్షల కోట్లు ఆవిరి
– సెన్సెక్స్ 770 పాయింట్ల పతనం
ముంబయి : దలాల్ స్ట్రీట్పై బేర్ పంజా కొనసాగుతోంది. వరుస నష్టాల నుంచి గురువారం ఉపశమనం లభించిందనుకునే లోపే వారాంత సెషన్లో మళ్లీ భారీ పతనాన్ని చవి చూసింది. రూ.6 లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది. ట్రంప్ టారిఫ్లు, లాటిన్ అమెరికా దేశాలను దుర్మార్గంగా బెదిరించడం, భారత వృద్ధి అంచనాలపై అనుమానాలు పెరగడం తదితర అంశాలు మార్కెట్లను కుదేలు చేస్తోన్నాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సెషన్లో బిఎస్ఇ సెన్సెక్స్ 769.67 పాయింట్లు లేదా 0.94 శాతం పతనమై 81,537.7కు పడిపోయింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 241.25 పాయింట్లు లేదా 0.95 శాతం కోల్పోయి 25,048కి పరిమితమయ్యింది. అమ్మకాల ఒత్తిడితో ఇన్వెస్టర్ల సంపద రూ.6 లక్షల కోట్లు తుడుచుకు పెట్టుకుపోయింది. దీంతో ఇంతక్రితం రోజు ఒక్క పూట లాభాల సంబరం ఆవిరయ్యింది. బిఎస్ఇలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.452 కోట్లకు పరిమితమయ్యింది.
బిఎస్ఇలో అదానీ పోర్ట్స్, ఎటెర్నల్, ఇండిగో, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు అధికంగా నష్టపోయాయి. మరోవైపు హిందుస్థాన్ యూనిలీవర్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టిసిఎస్ షేర్లు లాభపడ్డాయి. వరుసగా 13వ రోజు విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను తరలించుకుపోయారు. గురువారం రూ.2,550 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు. జనవరిలో ఇప్పటి వరకు దాదాపు రూ.36,591 కోట్ల విలువైన ఎఫ్ఐఐలను విక్రయించడంతో మార్కెట్లపై మరింత ఒత్తిడి పెరిగింది.
ఒక్క పూట సంబరం ఆవిరి..
- Advertisement -
- Advertisement -



