నవతెలంగాణ-హైదరాబాద్: ఈరోజుల్లో సెల్ఫోన్ వాడకం దైనదిన చర్యలో ఒక భాగమైంది. అదిలేనిదే..పూట కాదు క్షణం కూడా గడవట్లేదు. దాని యావలోపడి పలువుర్లు ప్రాణాలు పొగొట్టుకున్న సంఘటనలు అనేకం చూశాం. తాజాగా మధ్యప్రదేశ్లో కూడా ఓ ప్రయాణికుడు తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. బేతూల్ రైల్వే స్టేషన్ వద్ద 66 ఏళ్ల రాకేశ్ కుమార్ జైన్ భోపాల్-నాగ్పూర్ స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్నాడు. అయితే జర్నీ మధ్యలో నుంచి కాస్త నడవాలనే ఉద్దేశ్యంతో స్టేషన్లో దిగాడు. అయితే, అక్కడే ఓ మూలలో కూర్చుని తన మొబైల్ఫోన్ స్క్రోలింగ్లో లీనమయ్యాడు. ఆ సమయంలో ట్రైన్ కదలికను గమనించలేదు.. కాసేపటికి తేరుకున్న ప్రయాణికుడు.. వెంటనే పరుగెత్తి ఓ బోగీ హ్యాండిల్ పట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ చేతులు జారిపోవడంతో కింద పడ్డారు.
ఆ సమయంలో ప్లాట్ ఫామ్ మీద డ్యూటీలో ఉన్న RPF కానిస్టేబుల్ సత్యప్రకాశ్ రాజుర్కర్, గమనించి ఎలాంటి ఆలస్యం చేయకుండా జైన్ వైపు పరుగెత్తాడు. ఆ వృద్ధుడిని బోగీ తాకేలోపు పక్కకు లాగి బయటకు రక్షించాడు. ఇక ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా నెటిజన్స్ సదరు RPF పోలీసుకు నీరాజనాలు పడుతున్నారు.