Saturday, June 21, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపోలవరం-బనకచర్ల లింకు ప్రాజెక్టు పనులను కేంద్రం ఆపాలి: కోదండరాం

పోలవరం-బనకచర్ల లింకు ప్రాజెక్టు పనులను కేంద్రం ఆపాలి: కోదండరాం

- Advertisement -

– విభజన చట్టంలోని హామీల ఉల్లంఘనను కేంద్రం అడ్డుకోవాలి.
– పెండింగ్ లో ఉన్న తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసి అనుమతులు ఇవ్వాలి.
– పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు పై మాట్లాడే కనీస నైతికతను కే.సి.ఆర్ కు లేదు.
– తెలంగాణ రాష్ట్ర బిజెపి నాయకత్వం ఎందుకు మౌనంగా ఉంటుంది ?

నవతెలంగాణ – హైదరాబాద్; “జల వనరుల కేటాయింపు విషయంలోను, ప్రత్యేకించి పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపైన జరిగే చర్చ సందర్భంగా తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని ప్రాధమికంగా పరిగాణలోనికి తీసుకోవాలి. ఆ వెలుగులోనే నీటి కేటాయింపులు, ప్రాజెక్టులకు సంబంధించిన నిర్ణయాలు జరగాలని తెలంగాణ జన సమితి భావిస్తుంది.

• ఉమ్మడి రాష్ట్రంలో క్రష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో తెలంగాణకు నష్టం జరిగింది. ఎత్తున ఉన్నదనే నెపంతో తెలంగాణకు నీళ్ళు ఇవ్వలేదు. ఫలితంగా తెలంగాణ ప్రధానంగా బావుల మీద, బోర్ల మీద ఆధారపడ వలసి వచ్చింది.


• మొత్తం తెలంగాణలో కాలువల కింద సాగు ఒక్క గుంటూరు జిల్లాలో కాలువల కింద సాగు కన్నా తక్కువేనని గుర్తించాలి. ఈ ఒక్క విషయం చాలు తెలంగాణాకు ఎంత నష్టం జరిగిందో తెలుసుకోవడానికి.


• గోదావరి (బచావత్ ) ట్రిబ్యునల్ ముందు కూడా రాష్ట్ర అవసరాలను నివేదించినప్పుడు తెలంగాణ ప్రయోజనాలను లెక్క లోనికి తీసుకోలేదు.


• ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఆందోళనల తర్వాత చేపట్టిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం నత్తనడకన సాగింది. నిర్మాణం జరిగిన తరువాత కూడా దానిని ధవళేశ్వరానికి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గానే మార్చారు, ఫలితంగా తెలంగాణలో గోదావరి నీటి వినియోగం తక్కువగా ఉంది.


• ఉమ్మడి ఆంధ్రప్రదేశలో జరిగిన అన్యాయం, వివక్ష మూలంగా రాష్ట్ర సాధన ఉద్యమం తలెత్తింది. నీళ్ళు, నిధులు, నియామకాల్లో న్యాయమైన వాటా కోసం దశాబ్ధాల తరబడి పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము.


• రాష్ట్ర విభజన చట్టంలో నదీ జలాల యాజమాన్యానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. ఈ చట్టం ప్రకారం గోదావరి, కృష్ణా నదీజలాల యాజమాన్యానికి విడివిడిగా బోర్డులను ఏర్పాటు చేశారు. వాటిని పర్యవేక్షించడానికి, నీటి కేటాయింపుల అంశాన్ని నిర్ణయించడానికి ఎపెక్స కౌన్సిల్ ఏర్పడింది.


• ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు, అనుమతులు ఈ బోర్డుల పరిధిలోకి వస్తాయి.

• చట్టంలోని 84, 85 సెక్షన్ల ప్రకారం కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలను బోర్డు పరిశీలిస్తుంది. బోర్డు సూచనల మేరకు ఎపెక్స్ కౌన్సిల్ కొత్త ప్రాజెక్టుల పైన నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఈ చట్టాన్ని బేఖాతరు చేస్తూ ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు అనుమతుల కోసం నేరుగా కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. ఇది విభజన చట్టానికి విరుద్ధం. అయినప్పటికీ, ఫెడరల్ స్పూర్తికి తూట్లు పొడుస్తూ, తమ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుంది.


• విభజన చట్టంలోని అంశాలను ఉల్లంగించి కేంద్ర ప్రభుత్వ శాఖలు పోలవరం-బనకచెర్ల ప్రాజెక్టును పరిశీలించడం మొదలు పెట్టాయి. పరిమితులు ఏవైనా ఈ చట్టం ఇరు రాష్ట్రాల మధ్య సంప్రదింపులకు అవకాశం కల్పిస్తుంది. కానీ పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనను నేరుగా కేంద్రానికి నివేదించడం వలన తెలంగాణ తన అభ్యంతరాలను చెప్పడానికి ఉన్న అవకాశాలను కోల్పోయింది. ఈ చర్యల వలన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో వివక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మరోసారి స్పష్టమవుతుంది.


• ఇప్పటికైన కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా నాడు ఉమ్మడి రాష్ట్రంలో జల వనరుల కేటాయింపుల్లో తలెత్తిన అసమానతలను సరి చేయాలి. అందుకు గాను రెండు రాష్ట్రాల మధ్య న్యాయసమ్మతమైన నీటి పంపిణీ జరపాలి.


• తెలంగాణ ప్రాజెక్టులకు నీళ్ళు కేటాయించాలి, వాటి నిర్మాణానికి చేయూత నివ్వాలి. ఈ బాధ్యతను కేంద్రం నిర్లక్ష్యం చేయడం శోచనీయమైన విషయం. తెలంగాణ ఏర్పాటు వెనుకనున్న సామాజిక, చారిత్రక నేపధ్యాన్ని చూడక పోవడం వల్లనే ఇటువంటి తప్పిదాలు జరుగుతున్నాయి.


• నాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం చేసి, ఇప్పుడు మళ్లీ తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు రాకుండా ఆంధ్రా పాలకులు అభ్యంతరాలు లేవనెత్తుతున్నారు. ఢిల్లీతో ఉన్న రాజకీయ సంబంధాలతో తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టిస్తున్నారు.


• పోలవరం-బనకచర్ల ద్వారా నీళ్ళను గోదావరి బేసిన్ దాటి పెన్నా బేసిన్లో వాడుకోవడానికి ప్రయత్నం జరుగుతున్నది. పోలవరం-బనకచర్ల నిర్మాణం జరిగితే, తెలంగాణ గోదావరి జలాల్లో తన వాటాను శాశ్వతంగా కోల్పోవలసి వస్తుంది.


• వాస్తవానికి గోదావరి జలాల్లో ఆంధ్రకు 518 టీఎంసీలు,తెలంగాణకు 968 టీఎంసీల నీటి హక్కు ఉంది. కానీ ఇప్పటికే ఆంధ్ర ప్రాంతం సుమారు 630 టీఎంసీ ల గోదావరి నీటిని వాడుతున్నారు. ఈ కొత్త ప్రాజెక్టు నిర్మాణం ద్వారా అదనంగా మరొక 300 టీఎంసీల దాకా నీటిని తరలించుకునే కుట్ర చేస్తున్నారు. గోదావరి జలాల్లో తెలంగాణ నీటి వాడకం తక్కువ చేసి చూపించి ఆంధ్రప్రదేశ్ అక్రమంగా హక్కును పొందే ప్రయత్నం చేస్తున్నది. వరద లేదా మిగులు జలాల పేరుతో నికర జలాలను తరలించుకునే ప్రయత్నం జరుగుతోంది.


• ఈ కుట్రకు గత కే.సి.ఆర్ ప్రభుత్వ హయాంలోనే బీజాలు పడ్డాయి. దాన్ని ఎదుర్కొని తెలంగాణ హక్కులను కాపాడ వలసిన కెసిఆర్, బేసిన్లు లేవు భేషజాలు లేవని ఆంధ్ర పాలకులకే వంతపాడిండు, తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కొరకు తెలంగాణను బలిపెట్టిండు. నేడు పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు పై మాట్లాడే కనీస నైతికతను కే.సి.ఆర్, ఆయన పార్టీ కోల్పోయింది.


• కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇప్పటికి తెలంగాణ పట్ల చిన్నచూపు చూస్తూ సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నది. కృష్ణ గోదావరిలో తెలంగాణ వాట తేల్చకుండానే ,ఇక్కడున్న ప్రాజెక్టులను పూర్తి చేయకుండానే ,పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వకుండా, గెజిట్ ని తీసుకొచ్చి మొత్తం జలాల పై తన అజమాయిషీ ప్రదర్శిస్తున్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించకపోవడం నిలిపియ్యకపోవడం ప్రభుత్వం యొక్క ధోరణి అర్థమవుతుంది. ఈ సంధర్భంలో తెలంగాణ రాష్ట్ర బిజెపి నాయకత్వం ఎందుకు మౌనంగా ఉంటుంది ? ప్రజలకు బిజెపి నాయకులు జవాబు చెప్పాలి.


• గోదావరి జలాల్లో తెలంగాణకు న్యాయమైన నీటి వాటా తెల్చి, ప్రాజెక్టులకు అనుమతులివ్వాలని తెలంగాణ జన సమితి కోరుతుంది. తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కొరకు కలిసి వచ్చే అన్ని శక్తులతో కలిపి తెలంగాణ జన సమితి బనకచర్ల ప్రాజెక్టు వ్యతిరేక పోరాటాన్ని తీవ్రతరం చేస్తుంది. ” అని తెలిపారు.


ఈ కార్యక్రమంలో టీజేఎస్ ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ధర్మార్జున్, బైరి రమేష్, గోపగని శంకర్ రావు, పల్లె వినయ్, నిజ్జన రమేష్, యువజన సమితి అధ్యక్షుడు సలీం పాషా, విద్యార్థి జన సమితి అధ్యక్షుడు మాసంపల్లి అరుణ్, నగర కమిటీ నాయకులు నర్సయ్య, హనుమంత్ రెడ్డి, రాంచందర్, ఆకుల శ్రీనివాస్, ముక్కెర రాజు, కంతి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -