– ఏడీ హేమంత కుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట
చదువుతో పాటు నైపుణ్యం ఉంటేనే విజయం చేకూరుతుంది అని,చదువు మార్గం చూపితే,నైపుణ్యం గమ్యానికి చేరుస్తుంది,కాబట్టి ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఏదో ఒక నైపుణ్యం కలిగి ఉండాలని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జే.హేమంత కుమార్ అన్నారు.
అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మంగళవారం ఘనంగా సన్మానించారు.కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జె. హేమంత కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డి.స్రవంతి డాక్టర్ పి.ఝాన్సీ రాణి పాల్గొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసలు అందుకున్న ఈ కళాశాల విద్యార్థులు కే. రఘువీర్ రెడ్డి,భారత్ యంగ్ లీడర్ డైలాగ్ కార్యక్రమంలో నాలుగో దశకు చేరుకుని ఢిల్లీలో ప్రజెంటేషన్ ఇచ్చిన రెండో సంవత్సరం విద్యార్థిని ఎస్. సాత్విక,వికసిత్ భారత్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న రెండో సంవత్సరం విద్యార్థి మహర్షి వేదవ్యాస్ లను, రాష్ట్ర,జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని విజయం సాధించిన ఇతర విద్యార్థులను అధ్యాపక బృందం సన్మానించి,అభినందించారు.
ఈ సందర్భంగా అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, భవిష్యత్తులో అన్ని రంగాల్లో ప్రతిభ కనబరిచి కళాశాలకు పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థుల విజయాలే ఉపాధ్యాయులకు నిజమైన గౌరవమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు డాక్టర్ నాగాంజలి, డాక్టర్ రాంప్రసాద్, డాక్టర్ జంబమ్మ, డాక్టర్ శిరీష, డాక్టర్ దీపక్ రెడ్డి తదితరులు మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



