నవతెలంగాణ – కమ్మర్ పల్లి : బక్రీద్ పండగ నేపథ్యంలో పశువుల అక్రమ రవాణా జరక్కుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల కేంద్రం శివారులోని జంబి హనుమాన్ దేవాలయం సమీపంలో 63వ నంబర్ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్ట్ ను భీంగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి తో కలిసి జగిత్యాల జిల్లా మెట్ పల్లి వైపు నుండి వచ్చే వాహనాలను, కమ్మర్ పల్లి నుండి మెట్ పల్లి వైపు వెళ్లే వాహనాలను తనిఖీ చేశారు. బక్రీద్ నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, పశువుల ఆక్రమ రవాణా జరగకుండా ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలన్నారు. ప్రజలు కూడా ఎక్కడైనా పశువుల అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు గాని, డయల్ 100కు గాని సమాచారం ఇవ్వాలని సిఐ వెంకటేశ్వర్లు ప్రజలకు విన్నవించారు.
నకిలీ విత్తనాలు అనుకొని….
జాతి రహదారిపై ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద వాహనానికి చేస్తున్న సమయంలో విత్తనాల లోడుతో వెళ్తున్న లారీని పోలీసులు ఆపారు. అందులో ఉన్న విత్తనాలు పరిశీలించిన భీంగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి పరిశీలించారు.విత్తనాలు నకిలీవేమోనన్న అనుమానంతో లారీని పక్కకు ఆపించారు. విత్తనాలను నిర్ధారించుకునేందుకు మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ కి సమాచారం అందించడంతో ఆమె చెక్ పోస్ట్ వద్దకు చేరుకొని విత్తనాలకు సంబంధించిన రసీదులన్నింటి పరిశీలించి నకిలీ విత్తనాలు కావని చెప్పడంతో లారీని పోలీసులు వదిలేశారు.