ఇందిరమ్మ ఇళ్ళు, పారిశుధ్యం సమస్యలపై విన్నపాలు..
అనారోగ్యం కార్మికుడికి ఆర్ధిక చేయూత…
నవతెలంగాణ – అశ్వారావుపేట
నూతనంగా ఏర్పడిన అశ్వారావుపేట మునిసిపాలిటీ లో విధులు చేపట్టిన తర్వాత మొదటి సారిగా కమీషనర్ నాగరాజు శనివారం కలియ తిరిగారు. మునిసిపాలిటీ లోని దొంతికుంట,వడ్డెర బజార్, చిన్నంశెట్టి బజార్లలో మూడు వార్డులలో అధికారులు,ఇతర సిబ్బందితో కలసి పర్యటించిన సందర్భంగా ప్రజల నుండి అధికంగా అర్హులు అయిన కొందరికి ఇందిరమ్మ ఇల్లు రాలేదని కమీషనర్ కు విన్నవించుకున్నారు. సీసీ రోడ్డు నిర్మించి డ్రైనేజీలు మరిచారు అని, దీంతో సీసీ రోడ్లు ధ్వంసం అవుతున్నాయని, ఈ కారణంగా ఇళ్ళలోకి వరదనీరు వచ్చి చేరుతుందని స్థానికులు వాపోయారు.
వర్షాలు కురిసే సమయంలో ఇళ్ళలోకి వరదనీరు రాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. సందు – గొంది ల్లో కల్వర్ట్ లు లేకపోవటంతో వృద్ధులు, పిల్లలు బయటకు రావాలంటే ఇబ్బందులకు గురౌతున్నారు అని ఆయనకు పిర్యాదు చేశారు.వచ్చిన పిర్యాదులు పై సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని అప్పటికప్పుడు పరిష్కారం అయ్యే వాటిపై తక్షణ చర్యలు తీసుకుంటామని స్థానికులకు తెలిపారు. అనంతరం అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మున్సిపాల్టీ కార్మికుడు కి ఆర్ధిక చేయూత గా రూ.16 వేలు అందజేసారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.