కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శలు
సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ
నవతెలంగాణ-సిద్దిపేట
‘మాదేమో శ్రమ ఫలితం.. మీదేమో ప్రారంభ శిలాఫలకమా? ఆయిల్పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం మేము పూర్తి చేస్తే ప్రారంభం మాత్రం మీరు చేస్తారా?’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 22న సిద్దిపేటకు ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వస్తున్న సీఎం రేవంత్రెడ్డికి ఆయన రాసిన బహిరంగ లేఖను శనివారం క్యాంపు కార్యాలయంలో విలేకరుల ఎదుట విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిఫలమే ఈ పామాయిల్ ఫ్యాక్టరీ అని.. కాళేశ్వరంను కూలేశ్వరంగా మాట్లాడిన చేతుల మీదుగా ఈ ఫ్యాక్టరీ ప్రారంభించడం శోచనీయమని అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ఆయిల్పామ్ ఫ్యాక్టరీకి రూ.300 కోట్ల నిధుల కేటాయింపులు జరిగాయన్నారు.
నర్మెట్ట గ్రామ రైతుల సహకారంతో టీజీఐఐసీ ద్వారా 62 ఎకరాల భూమిని ఫ్యాక్టరీ నిర్మాణం కోసం సేకరించామన్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటు, పామాయిల్ తోటల సాగులో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఇన్నాళ్లు తమ నియోజకవర్గాన్ని పట్టించుకో లేదని, గతంలో తాను ఆరోగ్య శాఖ మంత్రిగా మం జూరు చేసి నిర్మించిన సెంట్రల్ డ్రగ్ స్టోర్, ఆయుష్ హాస్పిటల్, ప్రైమరీ హెల్త్ సెంటర్, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డి ప్రారంభిస్తున్నారంటూ విమర్శించారు. అదేవిధంగా కక్షతో రద్దు చేసిన సిద్దిపేట అభివృద్ధి పనులకు సంబంధించిన రూ.1070 కోట్ల నిధులు తిరిగి ఇవ్వాలనీ, సిద్దిపేట నియోజకవర్గంలో రుణమాఫీ కాని సగం మంది రైతులకు రుణమాఫీ చేయాలని, మూడుసార్లు ఎగ్గొట్టిన రైతు భరోసా నిధులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని హరీశ్రావు డిమాండ్ చేశారు.
22,819 మంది రైతులకు రుణమాఫీ కాలేదు
సిద్దిపేట నియోజకవర్గంలో 22,819 మంది రైతులకు రుణమాఫీ కాలేదని.. తమ రైతులకు సంబంధించిన దాదాపు రూ.300 కోట్ల రుణమాఫీ నిధులను విడుదల చేయాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. మూడుసార్లు ఎగ్గొట్టిన దాదాపు రూ.170 కోట్ల రైతుభరోసా డబ్బులను ఇచ్చి వెళ్తారని రైతులు ఆశపడుతున్నారంటూ సీఎంను ఉద్దేశించి అన్నారు. వడగండ్ల వర్షాలతో నష్టపోయిన రైతులకు రావాల్సిన పరిహారం మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గుండు భూపేష్, రాధాకృష్ణ శర్మ, మాణిక్యరెడ్డి, శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు.



