సుప్రీం న్యాయమూర్తుల బాటలోనే లాహోర్ హైకోర్టు జడ్జి రాజీనామా
లాహోర్ : పాకిస్తాన్లో శనివారం జ్యుడిషియల్ సంక్షోభం మరింత ముదిరింది. దేశ రాజ్యాంగానికి నూతనంగా తీసుకువచ్చిన సవరణ ద్వారా రాజ్యాంగంపై, న్యాయవ్యవస్థపై దాడి చేయడాన్ని నిరసిస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇద్దరు రాజీనామా చేయగా, తాజాగా లాహోర్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి షామ్స్ మెహమూద్ మీర్జా శనివారం రిజైన్ చేశారు. దీంతో వివాదాస్పదమైన సవరణ.. చట్టంగా మారిన తర్వాత హైకోర్టుకు రాజీనామా చేసిన తొలి న్యాయమూర్తి మీర్జా అయ్యారు. జస్టిస్ మీర్జా 2028లో పదవీ విరమణ చేయాల్సి ఉంది. సవరించిన చట్టం ప్రకారం, రాజ్యాంగానికి సంబంధించిన అంశాలను విచారించడానికి ఫెడరల్ రాజ్యాంగ కోర్టు (ఎఫ్సీసీ)ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతమున్న సుప్రీంకోర్టు కేవలం సాంప్రదాయ సివిల్, క్రిమినల్ కేసులను మాత్రమే విచారిస్తుంది.
కొత్తగా ఏర్పాటు చేసిన పాకిస్తాన్ ఫెడరల్ రాజ్యాంగ కోర్టుకు తొలి చీఫ్ జస్టిస్గా జస్టిస్ అమినుద్దిన్ ఖాన్ నియమితులయ్యారు. ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ 2030వరకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (సీడీఎఫ్) పదవిలో కొనసాగేందుకు కూడా రాజ్యాంగానికి చేసిన ఈ 27వ సవరణ అనుమతిస్తుంది. 27వ సవరణను అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఆమోదించిన గంటల వ్యవధిలోనే ఈ నెల 13న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ సయ్యద్మన్సూర్ అలీ షా, జస్టిస్ ఆథర్ మినల్లా రాజీనామా చేశారు. దేశ అత్యున్నత న్యాయ వేదికగా ఉన్న సుప్రీంకోర్టును ఎఫ్సీసీ కాలరాసిందని వారు విమర్శించారు. ఎఫ్సీసీ తీసుకున్న నిర్ణయాలకే సుప్రీంకోర్టు సహా అన్ని కోర్టులు కట్టుబడి ఉండాలి. దీన్ని వారు తీవ్రంగా నిరసించారు.
పాక్లో ముదిరిన న్యాయ సంక్షోభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



