మేయర్ కూరగాయల ఉమారాణి
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణి అన్నారు. సోమవారం నిజామాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక అనంతరం మున్సిపల్ ఆవరణంలో విలేకరులతో మేయర్ కూరగాయల ఉమారాణి మాట్లాడుతూ.. తన గెలుపుకు కృషిచేసిన 49 వ డివిజన్ ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
మేయర్ పదవి రావడానికి కృషిచేసిన టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, సుదర్శన్ రెడ్డి, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, సీతక్క, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నగేష్ రెడ్డి, నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా మేయర్ ఎన్నికకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు, మద్దతు తెలిపిన ఎంఐఎం కార్పొరేటర్లకు, బిఆర్ఎస్ కార్పొరేటర్కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆశీర్వాదమే ఈ విజయమని ఆమె అన్నారు. అంతకుముందు విజయం ఖరారు కాగానే మేయర్ గా ఎన్నికైన కూరగాయల ఉమారాణి మొట్టమొదటిసారిగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆశీర్వాదాన్ని తీసుకున్నారు.



