Friday, June 13, 2025
E-PAPER
Homeజాతీయంఅట్టడగు యువత వృద్ధితోనే దేశాభివృద్ధి

అట్టడగు యువత వృద్ధితోనే దేశాభివృద్ధి

- Advertisement -

విద్యార్థుల సమస్యలపై ప్రధానికి రాహుల్‌ లేఖ
న్యూఢిల్లీ :
అట్టడుగు వర్గాల యువత అభివృద్ధి చెందనిదే దేశం అభివృద్ధి చెందదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. అణగారిన వర్గాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి బుధవారం ఆయన లేఖ రాశారు. వారి కోసం ఏర్పాటుచేసిన రెసిడెన్షియల్‌ హాస్టళ్ల పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని, పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల ఆలస్యం కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. దీని కారణంగా 90 శాతం విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని తెలిపారు. తాను బీహార్‌లోని దర్భాంగాలో అంబేద్కర్‌ హాస్టల్‌ను సందర్శించినప్పుడు అక్కడి విద్యార్థులు తనతో పలు విషయాలను పంచుకున్నారన్నారు. ఆరుగురు విద్యార్థులు ఒకే గదిని పంచుకోవాల్సి వస్తోందని, అపరిశుభ్రమైన మరుగుదొడ్లు, సురక్షితం లేని తాగునీరు, మెస్‌ సౌకర్యాల కొరత, లైబ్రరీలు, ఇంటర్నెట్‌ లేకపోవడంపై విద్యార్థులు ఫిర్యాదు చేశారని అన్నారు. పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు ఆలస్యం, వైఫల్యాలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. బీహార్‌లో స్కాలర్‌షిప్‌ పోర్టల్‌ మూడు సంవత్సరాలుగా పనిచేయడం లేదని, 2021-22లో ఏ విద్యార్థికీ స్కాలర్‌షిప్‌ అందలేదని పేర్కొన్నారు. అలాగే స్కాలర్‌షిప్‌లు పొందిన దళిత విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని అన్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో 1.36 లక్షల విద్యార్థులు లబ్ధిపొందగా, 2024 ఆర్థిక సంవత్సరంలో 69 వేల మంది పొందారని పేర్కొన్నారు. ఈ సంఖ్య దాదాపు సగానికి పడిపోయిందని అన్నారు. దేశవ్యాప్తంగా పరిస్థితి ఇలానే ఉందని తెలిపారు. ఈ వైఫల్యాలను సరిచేయడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి హాస్టల్‌ను ఆడిట్‌ చేయాలని, లోపాలను పరిష్కరించడానికి తగిన నిధులను కేటాయించాలని సూచించారు. సకాలంలో పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని, స్కాలర్‌షిప్‌ మొత్తాలను పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో విధానాలను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -