‘టీ-ఫైబర్’ పైలెట్ ప్రాజెక్టు దేశానికే ఆదర్శం : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి శ్రీధర్బాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న డిజిటల్ అంతరాన్ని తగ్గించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమనీ, అందుకనుగుణంగానే పకడ్బందీ ప్రణాళికలను రూపొందించి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి డి.శ్రీధర్బాబు అన్నారు. బుధవారం డిల్లీలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన జరిగిన ‘స్టేట్ గవర్నమెంట్ ఐటీ మినిస్టర్స్ అండ్ ఐటీ సెక్రెటరీస్ రౌండ్ టేబుల్’ సదస్సులో ఆయన తెలంగాణ ఐటీ గ్రోత్ను వివరించారు. ”భావితరాల కోసం పటిష్టమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నాం. అధునిక సాంకేతిక ఫలాలు మారుమూల ప్రాంతాల్లో ఉన్న చివరి వ్యక్తి వరకూ చేరాలన్నదే మా లక్ష్యం.
టీ-ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి, ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలకు తక్కువ ఖర్చుతో హై-స్పీడ్ కనెక్టివిటీని అందించేందుకు కృషి చేస్తున్నాం. డిజిటల్ ఇండియా, భారత్ నెట్ లక్ష్యాలకనుగుణంగా ఫైబర్-టు-ది-హౌమ్ నెట్వర్క్ ద్వారా ఈ-గవర్నెన్స్, విద్య, ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ వ్యవస్థాపకత తదితర సేవలను ప్రజల ముంగిటకే సమర్థవంతంగా చేర్చుతున్నాం’ అని చెప్పారు. ‘భారత్ నెట్’ అమల్లో వేగం పెంచాలనీ, రైట్ ఆఫ్ వే సవాళ్లను పరిష్కరించాలనీ, డిజిటల్ ఆస్తులను పరిరక్షించేందుకు సైబర్ భద్రత ఫ్రేమ్ వర్క్లను బలోపేతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కేంద్రాన్ని కోరారు. ఈ అంశాల్లో రాజకీయాలకు అతీతంగా కేంద్రంతో కలిసి పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ సమావేశంలో టీ-ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.