– ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్, మండల ప్రత్యేక అధికారి తిరుమల ప్రసాద్
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేయడం ద్వారా జిల్లాలో మండలాన్ని ముందుంచాలని మండల ప్రత్యేక అధికారి, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ తిరుమల ప్రసాద్ అన్నారు. బుధవారం మండలంలోని హాస కొత్తూర్ గ్రామంలో నిర్వహించిన మార్కౌట్ మహామేళ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసి, వారితో ముగ్గులు పోయించారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు, లబ్ధిదారులకు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడారు.
ఇందిరమ్మ గృహాలను నిర్మించుకుంటున్న లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. అధికారుల సహకారంతో ఇండ్ల నిర్మాణాల్లో ఎలాంటి జాప్యం లేకుండా, వేగంగా ఇండ్ల నిర్మాణం పూర్తయ్యేలా లబ్ధిదారులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇండ్ల నిర్మాణాలు పూర్తయిన వెంటనే దశలవారీగా బిల్లులు చెల్లించడం జరుగుతుందన్నారు. వేగంగా జిల్లా నిర్మాణాలను పూర్తి చేయడం ద్వారా జిల్లాలో మండలాన్ని ముందుంచాలని లబ్ధిదారులకు, అధికారులను కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి నవీన్ గౌడ్, ఐకెపి సీసీలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.