ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు..
తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అసోంలో ‘మే’ నెలతో ముగియనున్న గడువు
పుదుచ్చేరిలో జూన్ 15 చివరి తేదీ
మార్చి రెండు లేదా మూడో వారంలో నోటిఫికేషన్
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్ నెలలో నగారా మోగనుంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి రెండు లేదా మూడో వారంలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే తమిళనాడు, అసోం, కేరళ, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ గడువు మే నెలలో ముగియనుంది. పుదుచ్చేరి అసెంబ్లీ గడువు జూన్ 15 నాటికి ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈసీ అధికారులు ఇప్పటికే ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.ఇదిలా ఉండగా 2021లో పశ్చిమబెంగాల్లో ఎనిమిది విడతల్లో పోలింగ్ నిర్వహించారు. అసోంలో రెండు, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే విడతలో ఈసీ ఎన్నికలు నిర్వహించింది. మరోవైపు, ఆయా రాష్ట్రాల్లో ఈసీ నిర్వహిస్తున్న సర్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. పుదుచ్చేరిలో ఇప్పటికే ఓటర్ల తుది జాబితాను కూడా ప్రకటించారు.



