అధిష్టానం అడిగితే అప్పుడే వివరణ ఇచ్చాం
కులం పేరుతో విమర్శించడం సరికాదు
కవిత పాదయాత్రను స్వాగతిస్తున్నాం
బీఆర్ఎస్ పదేండ్ల పాపపు పాలనలో ఆమె పాత్ర ఏంటి?
ఈ నెలాఖరుకల్లా డీసీసీల నియామకం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు మాదే : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మంత్రుల పంచాయతీ ముగిసిన అధ్యాయమని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ విషయంలో ఇంకా స్పందించడానికి ఏమీ లేదన్నారు. మంత్రి కొండా సురేఖ విషయంలో పోలీసులది కమ్యూనికేషన్ గ్యాప్ అని చెప్పారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ విషయాన్ని కేటీఆర్, హరీశ్రావులు అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అసలు తుపాకులే లేనప్పుడు… తుపాకీల పంచాయితీ ఎక్కవడిదన్నారు. డీసీసీ అధ్యక్షుల ఎంపికపై ఢిల్లీకి వచ్చిన ఆయన ఆదివారం తెలంగాణ భవన్ లోని శబరీ బ్లాక్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు. మంత్రుల మధ్య పంచాయితీపై అధిష్టానం అడిగితే అప్పుడే సంపూర్ణ వివరణ ఇచ్చామన్నారు.
అయితే ఈ విషయంలో కొండా సురేఖ కూతురు కులాల ప్రస్తావన చేయడం సరికాదన్నారు. ఆమె పార్టీకి చెందిన వ్యక్తి కాదని గుర్తు చేశారు. ఎవరు ఎక్కడైనా కులాల గురించి, మతాల గురించి మాట్లాడటం ఆక్షేపణీయమన్నారు. ఎవరు ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలని ఆయన సూచించారు.గోడలకు సైతం చెవులు ఉండే సమయం, జాగ్రత్తగా మాట్లాడాలని నేతలకు హితవు పలికారు. జీవన్ రెడ్డి, లక్ష్మణ్ ల మధ్య గురు శిష్యుల బంధం ఉందన్నారు. అయితే… గురువుకు దక్కని మంత్రి పదవి, శిష్యుడికి లభించిందని చెప్పారు.’నాకు కూడా పార్టీలో ఇలాంటి ఎన్నో పరిణామాలు ఎదురయ్యాయి. ఓపికగా ఉండాలి. ఎవరైనా పార్టీ నియమాలకు లోబడే ఉండాలి. ఫైనల్ గా పార్టీలో అన్నింటికన్నా అధిష్టానమే సుప్రీం’ అని చెప్పుకొచ్చారు.
నెలాఖరులో డీసీసీలు…
డీసీసీల నియామకాల విషయంలో సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీగా తన అభిప్రాయాలను సైతం అధిష్టానం తీసుకుందన్నారు. అలాగే మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తన అభిప్రాయాలను పంపారన్నారు. ఈ నెలాఖరులోపు తెలంగాణ తో పాటు రాజస్తాన్, ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాలకు చెందిన ఈ డీసీసీ ప్రకటన వస్తుందన్నారు. ఈ విషయంలో మరోసారి హైకమాండ్ నుంచి పిలుపు రాదాని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే… ఆశావాహులు ఎక్కువగా ఉన్న జిల్లాల డీసీసీల ఎంపిక కొలిక్కి రాలేదని, ఈ విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కరీంనగర్ జిల్లా డీసీసీ కోసం 36 అప్లికేషన్లు వచ్చాయన్నారు. ఇందులో ఉమ్మడి జిల్లాకు చెందిన స్థానిక మంత్రులు పలువురి పేర్లను సిఫారసు చేశారన్నారు. అలాగే రంగారెడ్డి, హైదరాబాద్, ఇతర ఏరియాల నుంచి పెద్ద సంఖ్యలో ఆశావాహులు ఉన్నారన్నారు.
ఎమ్మెల్యేలకు డీసీసీ బాధ్యతలు..
డీసీసీల నియామకముల విషయంలో నలుగురు ఎమ్మెల్యేలకు ఆయా బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందన్నారు. మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సతీమణి డీసీసీ అధ్యక్ష పదవి కోసం అప్లై చేసినట్టు తెలిసిందన్నారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు డీసీసీ బాధ్యతలు తీసుకోవడం మంచిదన్నారు. ఎమ్మెల్యేలకు డీసీసీ పదవులు డబుల్ పోస్టులుగా చూడటం లేదన్నారు. సదరు కుటుంబాలు అప్పటికే పార్టీలో ఉండి, సర్వీస్ చేస్తుంటే వాళ్ల వారసులకు పదవులు అడ్డంకి కాదన్నారు.
ఉన్నపళంగా తెరపైకి వచ్చి పోస్టులు అడిగితే ఇవ్వరని కరాకండిగా తేల్చి చెప్పారు.’నేను పార్టీలో ఉన్నా.. నాకొడుకు ఇప్పటిప్పుడు వచ్చి పోస్ట్ అడిగితే ఇవ్వరు. అదే కోమటి రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లు కుటుంబాలు పార్టీలో సుదర్ఘీ కాలంగా ఉన్నాయి. వాళ్లకు ఇస్తారు’ అని ఉదహరించారు. రెండు పదవులు ఉండొద్దు అనే నిబంధన ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఒక పదవికి సెలెక్ట్ అయితే, ఇంకో పదవికి రాజీనామా చేయాల్సిందేనన్నారు.
కవిత పాదయాత్రను స్వాగతిస్తున్నాం…
ప్రజాస్వామ్యాన్ని నమ్మే కాంగ్రెస్ పార్టీ కి చెందిన నేతగా ఎమ్మెల్సీ కవిత పాదయాత్రను స్వాగతిస్తున్నట్లు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. పాదయాత్రలు చాలా మంచిదని, కనీసం ప్రజల సమస్యలైనా తెలుస్తాయన్నారు. అయితే… కవిత సగం నిజాలు, సగం అబద్ధాలు చెబుతున్నారన్నారు. మొత్తం నిజాలు మాట్లాడినప్పుడు పూర్తిగా ఆమెను స్వాగతిస్తామని చెప్పారు. కేసీఆర్ పదేండ్ల పాపను పాలనలో కవితకు సైతం భాగస్వామ్యం ఉందని, అందుకే ఆమెను ప్రశ్నిస్తున్నట్టు చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో అపుడు అమరవీరులకు ఎందుకు న్యాయం చేయలేదో ప్రజలకు చెప్పాలన్నారు.
అన్ని అంశాల్లో కవిత వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి సరైన విధంగా రాష్ట్రానికి సహకారం లేదన్నారు. పార్టీలు, రాజకీయాలు ఎన్నికల వరకే అని… ఎన్నికలు ముగిసాక అభివృద్ధి కోసం అన్ని పార్టీలు కృషి చేయాలన్నారు. ఈ విధానంతోనే పక్కరాష్ట్రమైన తమిళనాడు ఎంతో సాధించుకుందని గుర్తు చేశారు. కానీ… తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, సంజయ్ ల నిర్లక్ష్యం వల్ల మెట్రో ఫేస్ – 2, ప్రాజెక్ట్ లు, పరిశ్రమల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పారు.
చేపల పులుసు మత్తులో కేసీఆర్…
ఉద్యమ నేతగా కేసీఆర్ ను గౌరవిస్తామని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆయనతో పాటు తాము సైతం తెలంగాణ ఉద్యమంలో పోరాడామని గుర్తు చేసుకున్నారు. అయితే.. కేసీఆర్ పదేండ్లు గాడి తప్పిన పాలన చేశారని విమర్శించారు. అందువల్లే రాష్ట్రం దివాలా తీసిందని విమర్శించారు. ఏపీ మాజీ మంత్రి రోజా ఇంట్లో చేపల పులుసు మత్తులో కేసీఆర్… రాయలసీమను రతనాల సీమ చేస్తానంటూ తెలంగాణ కు అన్యాయం చేశారన్నారు. కేసీఆర్ ఉదాసీనత మాటల వల్లే ఏపీ సర్కార్ బనక చర్ల ప్రాజెక్ట్ ను తెరపైకి తెచ్చిందని ఫైర్ అయ్యారు.
హైకమాండ్ రాడార్ లో…
పార్టీ నేతలు ఎవరూ పార్టీ లైన్ దాటొద్దని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మరోసారి హెచ్చరించారు. రాష్ట్రంలో పరిస్థితులు అన్నింటిని హైకమాండ్ గమనిస్తుందని చెప్పారు. ‘అందరం హైకమాండ్ రాడార్ లో ఉన్నామని గుర్తుంచుకోవాలి. మంత్రులు, నేతలు చేసే అన్ని మంచి, చెడులు అధిష్టానం నోట్ చేస్తుంది.’ అని తెలిపారు. కేసీఆర్ తో చర్చలో డీసీసీల నియామకంతో పాటు జూబ్లీహిల్స్ ఎన్నికలు, మంత్రుల తీరు, తాజా రాజకీయ పరిస్థితులను వివరించినట్టు చెప్పారు. కాగా… తాజా రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ లో మంత్రుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారన్నారు. అధిష్టానం ఆదేశాలతో పాటు కలిసి గట్టుగా ఉండాల్సిన విషయాన్ని స్పష్టంగా చెప్పారన్నారు.
జూబ్లీహిల్స్లో 100 శాతం గెలుస్తాం…
బీజేపీకి ఎప్పుడైనా కూడా మతం పేరుతో రాజకీయాలు చేయడమే తప్పా అభివృద్ధి తెలియదన్నారు. మతం పేరుతో ఓట్లు దండుకోవడమే ఆ పార్టీ విధానమని ఫైర్ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఇదే యోచనలో కమలం పార్టీ ముందుకెళ్తుందని విమర్శించారు. రాముడు పేరు వాడుకోవడం తప్పా… కేంద్రం మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజక వర్గానికి ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. మరో మంత్రి బండి సంజయ్ … పీజేఆర్ నిర్మించిన పెద్దమ్మ టెంపుల్ ను ఉండగా, ఉప ఎన్నికల్లో గెలిస్తే అదే పెద్దమ్మ ఆలయం నిర్మిస్తామని చిల్లర మాటలు మాట్లాడుతున్నారన్నారు. ‘గుళ్లు, గోపురాలను బీజేజీ వాడుకుంటోంది. వేలాది ఏండ్ల కిందటే రాముడు ఏలాడు. కానీ దేశానికి స్వాతంత్య్ర వచ్చిన 40 ఏండ్లకు బీజేపీ పుట్టింది. మరి వారికి శ్రీరాముడితో ఏం సంబంధం’ అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఒక్కో నియోజక అభివృద్ధి జరుగుతోందన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల విషయంలో వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళడం తమ సంస్కృతి కాదన్నారు. మాజీ ఎమ్మెల్యే, దివంగత మాగంటి కుటుంబ విషయాలు.. మీడియాలో చూశాకే తెలుసు అని చెప్పారు. జూబ్లీహిల్స్ లో 10 ఏండ్లు బీఆర్ఎస్ గెలిస్తే ఓటు చోరీ కాంగ్రెస్ తో ఎలా సాధ్యమన్నారు. ఓట్ చోరీ పై తొలుత ఫిర్యాదు చేసింది రేవంత్ రెడ్డి అని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విషయంలో మంత్రులు, అధికారులు ఎవరైనా జవాబుదారీ తనంగా ఉండాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం అని, 100 శాతం గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలో ప్రచారంలో భాగంగా ఫస్ట్ ఫేజ్ లో 4, సెకండ్ ఫేజ్ లో 2 మీటింగ్ లు ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు.



