– ప్రతిఘటించేందుకే జులై 9న దేశవ్యాప్త సమ్మె
– జయప్రదం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలి
– మోడీ సర్కారు విధానాలతో సమాజంలో తీవ్ర ఆర్థిక అసమానతలు : సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు డాక్టర్ కె.హేమలత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశంలో కార్మికవర్గంపై దాడి తీవ్రమైందనీ, దాని ప్రతిఘటించేందుకే జులై 9న దేశవ్యాప్త స్వారత్రిక సమ్మె చేపట్టబోతున్నట్టు సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు డాక్టర్ కె.హేమలత తెలిపారు. ఆ సమ్మె జయప్రదం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలనీ, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. అందులో ఆమె మాట్లాడుతూ…దేశంలో సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితులు దిగజారుతున్నాయనీ, సమాజంలో అసమానతలు పెరిగిపోతు న్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి చేతుల్లోనే సంపద కేంద్రీకరణ కావడమే దీనికి కారణమని విడమర్చి చెప్పారు. ఇది దేశంలో సంక్షోభానికి దారితీస్తున్నదని హెచ్చరించారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షులు ట్రంప్ ప్రేలాపనలు, టారిఫ్ల పెంపులు కూడా పెట్టుబడిదారీ విధాన సంక్షోభంలో భాగమేనని స్పష్టం చేశారు. ఇతర దేశాల సరుకులపై పన్నుల భారం మోపం ద్వారా తన సంక్షోభాన్ని తప్పించుకునే పనిలో అమెరికా ఉందని తెలిపారు.
30, 40 ఏండ్లుగా అమెరికా ఉత్పత్తి ప్రక్రియను ఆపేసి చౌకగా కార్మిక శక్తి దొరికే ప్రాంతాలకు మళ్లించిన తీరును వివరించారు. వివిధ దేశాల్లో తయారయ్యే సరుకులు అమెరికా దిగుమతి చేసుకుంటున్నదని చెప్పారు. కార్పొరేట్లకు మరిన్ని లాభాలు కట్టబెట్టేందుకే మోడీ సర్కారు లేబర్ కోడ్లను తీసుకురావడం కార్మికవర్గంపై దాడేనన్నారు. వాటిని ప్రతిఘటించకపోతే దేశ కార్మికోద్యమ ఉనికే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. పహల్గాం ఉగ్రవాద ఘటన నేపథ్యంలోనే సార్వత్రిక సమ్మెను జులై 9కి వాయిదా వేయాలని అన్ని కార్మిక సంఘాలు సమిష్టి నిర్ణయం తీసుకున్నాయన్నారు. గుజరాత్లో కార్మికవర్గంపై దాడి తీవ్రంగా ఉందని చెప్పారు. ఇటీవల జేకే పేపర్ మిల్లులో సమ్మె జరిగితే ఆ రాష్ట్ర కార్మిక శాఖ కమిషనరే గుజరాత్లో ఈ సమ్మె ఏంటని బహిరంగంగా ప్రశ్నించారనీ, తమ శాఖ జోక్యం చేసుకోబోదని చేతులెత్తేశారని వివరించారు. అయినా, కార్మికులు మొక్కవోని దీక్షతో 37 రోజులు సమ్మె చేసి తమ కోర్కెలను సాధించుకున్నారని కొనియాడారు. కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం చట్టాన్ని బేఖాతరు చేస్తూ రాత్రి షిప్టుల్లోనూ మహిళలు పనిచేయాలని ఆదేశాలు జారీ చేసిందని గుర్తుచేశారు. పాలకులెవరైనా కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ కార్మికవర్గానికి చేస్తున్న అన్యాయాన్ని కార్మికులకు అర్థమయ్యేలా విడమర్చి చెప్పాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను కోరారు. సార్వత్రిక సమ్మె జయప్రదం కోసం క్యాంపెయిన్ను క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లాలని సూచించారు. సమావేశంలో సీఐటీయూ అఖిలభారత కోశాధికారి ఎం. సాయిబాబు, రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఆఫీస్ బేరర్లు పాల్గొన్నారు.
కార్మికవర్గంపై తీవ్రమవుతున్న దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES