వాటికన్ సిటీలో క్రిస్మస్ ప్రసంగంలో పోప్ ప్రస్తావన
పాలస్తీనియన్ల దుస్థితి పట్ల ఆవేదన
వాటికన్ సిటీ : గాజాలో పాలస్తీనియన్లు ఎదుర్కొంటున్న దుస్థితిపై పోప్ లియో తీవ్రంగా విచారం వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య దశాబ్దాలుగా సాగుతున్న ఈ ఘర్షణకు ఏకైక పరిష్కారం స్వతంత్ర పాలస్తీనా ఏర్పడడమేనని ఆయన పునరుద్ఘాటించారు. ఇటీవల కాలంలో పాలస్తీనియన్లు ఎదుర్కొంటున్న పరిస్థితులపై ఆయన పలుసార్లు ఆవేదన వెలిబుచ్చారు. గురువారం క్రిస్మస్ సందర్భంగా చేసిన ప్రసంగంలో ఆయన తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ఆథ్యాత్మికత, సేవా భావం ప్రధానంగా సాగే ఈ ప్రసంగం లో ఈసారి అయన పాలస్తీనా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పశువుల పాకలో ఏసు జన్మించిన కథను మనం గుర్తు చేసుకున్నపుడు గాజాలో వారాల తరబడి వర్షాలు, గాలులు, చలికి ఇబ్బందులు పడుతున్న ప్రజల గురించి ఆలోచించకుండా ఎలా వుండగలం? అని ఆయన ప్రశ్నించారు.
పోప్ ఫ్రాన్సిస్ స్థానంలో అమెరికాకు చెందిన లియో పోప్గా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా క్రిస్మస్ వేడుకల్లో ప్రసంగించారు. గతంలో పోప్ ప్రసంగాల్లో ఎన్నడూ రాజకీయ ప్రస్తావనలు వుండేవి కావు. వాటికి భిన్నంగా లియో ప్రసంగం సాగింది. సెయింట్ పీటర్స్ బాసిలికాలో వేలాదిమంది మధ్య గురువారం సాగిన ఈ ప్రసంగంలో లియో, సుదీర్ఘకాలం గా కొనసాగుతున్న యుద్ధాల వల్ల జరుగుతున్న వినాశనం, విధ్వంసంతో ప్రపంచవ్యాప్తంగా ఇల్లూ వాకిలి లేకుండా నిరాశ్రయులుగా ఇబ్బందులు పడుతున్న వేలాదిమంది ఎదుర్కొంటున్న పరిస్థితుల పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి రక్షణ లేని ప్రజల జీవితాలను ఈ యుద్ధాలు అత్యంత దయనీయంగా మారుస్తున్నా యన్నారు. వారు శిధిలాల్లో గాయాలతో జీవితాలను వెళ్ళమార్చాల్సి వస్తోందని ఆందోళన వెలిబుచ్చారు.



