– యువతరం అభ్యుదయభావాలతో పురోగమిస్తోంది
– యూనివర్సిటీ ఎన్నికల్లో గెలుస్తున్నారు
– పెట్టుబడిదారీ విధానంపై విశ్వాసం కోల్పోతున్నారు
– ప్రపంచ ఆర్థిక విధ్వంసానికి ట్రంప్ నిర్ణయాలే ప్రత్యక్ష ఉదాహరణ : జీ రఘుపాల్ సంస్మరణ సభలో సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సోషలిజంపై విశ్వాసాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదనీ, ప్రపంచ చరిత్ర గతిని పరిశీలిస్తే మార్పు తథ్యమని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. ”మాయా సమాజం’ ప్రజల ముందు ఉంది. దాన్ని పొరలు పొరలుగా వారికి అర్థమయ్యేట్లు విప్పి చెప్పాలి” అని చెప్పారు. శనివారం హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే) ఆధ్వర్యంలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ కమిటీ సభ్యులు జీ రఘుపాల్ సంస్మరణ సభ ఎస్వీకేలో జరిగింది. దీనికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. యువతరం ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్నదనీ, అభ్యుదయవాదులు యూనివర్సిటీ ఎన్నికల్లో గెలుస్తున్నారని చెప్పారు. పెట్టుబడిదారీ విధానంపై విశ్వాసం పోతున్నదనీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల దెబ్బతో ప్రపంచ ఆర్థిక విధ్వంసం ఎలా ఉంటుందో నేటి తరానికి తెలిసి వస్తున్నదని విశ్లేషించారు. గడచిన 30 ఏండ్లుగా ప్రపంచ వాతావరణం విప్లవోద్యమానికి అనుకూలంగా లేదనీ, ధనస్వామ్య ఆధునికతను తట్టుకొనే స్థితిలో కమ్యూనిస్టులు లేరని చెప్పారు. కానీ ప్రపంచవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో చదువుకుంటున్న విద్యార్థుల ఆలోచనలు క్రమంగా అభ్యుదయభావంవైపు మళ్లుతున్నాయంటూ పలు ఉదాహరణలు చెప్పారు. జాతీయోద్యమం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, స్వాతంత్య్రానంతర విప్లవోద్యమాల్లో కమ్యూనిస్టుల పాత్ర చాలా గొప్పదనీ, దానివల్లే ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఇప్పటికీ మనగల్గుతున్నదని విశ్లేషించారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఊచకోత కోస్తున్నారనీ, ప్రజల్లో భ్రమలు సృష్టించి రాజ్యం బలం పెంచుకుంటున్నదనీ, ఇలాంటి మార్పుల్ని తట్టుకొని విప్లవోద్యమం ముందుకు సాగాలని ఆకాంక్షించారు. దేశ ఐక్యత, ప్రజల్లో చదువుపట్ల ఆసక్తిని పెంచింది కమ్యూనిస్టులేనని చెప్పారు. పాలస్తీనాకు సంఘీభావం తెలిపిన విద్యార్థులను అమెరికా దేశం నుంచి వెళ్లగొట్టిందనీ, కానీ ఓ విద్యార్థిని అదే యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ డేలో పాలస్తీనాకు మద్దతుగా ఉపన్యాసం ఇచ్చి, అమెరికా పెత్తనాన్ని ప్రశ్నించిందని వివరించారు. ఇలాంటి యువతరం అరుదుగా ఉన్నారనీ, భవిష్యత్లో మరింతమంది ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రఘుపాల్ జీవితం నేటి తరానికి ఆదర్శవంతమనీ, 80 ఏండ్లు ఆయన రాజకీయ జీవితం గడిపారని తెలిపారు. వ్యక్తి జీవితానికీ, సమాజ జీవితానికి మార్పులు ఉంటాయని విశ్లేషించారు. ఆయన సినిమాల విశ్లేషణ చేస్తూ, సమాజాన్ని అధ్యయనం చేసేవారని చెప్పారు. పెట్టుబడిదారీవర్గం సమాజాన్ని గుప్పిట్లో పెట్టుకొనేందుకు మీడియాను ఓ అస్త్రంగా ఉపయోగిస్తున్నదని అన్నారు. రఘుపాల్ మానసిక ధైర్యసాహసాలు కలిగిన వ్యక్తి అని, ఈ తరం దాన్ని అలవర్చుకోవాలని చెప్పారు.
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య, టీ జ్యోతి మాట్లాడుతూ రఘుపాల్తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబం మొత్తాన్ని పార్టీతో మమేకం చేసిన తీరు ఆదర్శప్రాయమని చెప్పారు. నమ్మిన ఆశయం, లక్ష్యం కోసం చివరివరకు నిలబడిన మహోన్నత వ్యక్తి ఆయన అని నివాళులు అర్పించారు. ఎస్వీకే మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్ వినయకుమార్ మాట్లాడుతూ రఘుపాల్ వ్యక్తిత్వం, గుణగణాలను శ్లాఘించారు. అన్ని పనుల్ని వేగంగా చేసే ఆయన మృత్యువును కూడా వేగంగా చేరుకున్నారని విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి సీపీఐ(ఎం) సెంట్రల్ సిటీ మాజీ కార్యదర్శి ఎమ్ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. కేంద్ర కమిటీ సభ్యులు ఎమ్ సాయిబాబు, సీపీఐ(ఎం) రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మెన్ డీజీ నర్సింహారావు, సీఐటీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్, సీపీఐ(ఎం) ఉమ్మడి హైదరాబాద్ మాజీ కార్యదర్శి పీఎస్ఎన్ మూర్తి, సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎమ్ వెంకటేష్, సౌత్సిటీ కార్యదర్శి ఎమ్డీ అబ్బాస్, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి పీ సత్యం, అఖిలభారత శాంతి సంఘం రాష్ట్ర కార్యదర్శి జీ నాగేశ్వరరావు, ఐలూ రాష్ట్ర నాయకులు కే పార్థసారధి, ట్రేడ్ యూనియన్ సీనియర్ నాయకులు ఎస్ నర్సింహారెడ్డి, రఘుపాల్ సతీమణి జీ భారతి, వారి కుమారుడు డాక్టర్ గోపీ, కుటుంబసభ్యులు కే సుప్రియ పాల్గొన్నారు. అంతకుముందు రఘుపాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
మార్పు తథ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES