– సీఎం చేతుల మీదుగా త్వరలో ప్రారంభం
– కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం : మంత్రులు
– 50 పడకల మాతా శిశు, 150 పడకల వైద్యశాల ప్రారంభం
– హుస్నాబాద్లో భారీ ర్యాలీ
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్/ నంగునూరు
రాష్ట్రంలోనే మొదటి రిఫైనరీ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని నర్మెటలో నిర్మిస్తున్నామని, దాన్ని త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు అండగా ఉంటామని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహతో కలిసి తుమ్మల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. హుస్నాబాద్లో రూ.82 కోట్లతో నూతనంగా నిర్మించిన 150 పడకల వైద్యశాల, రూ.11.50 కోట్లతో నిర్మించిన 50 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు.
హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఎన్బీఎస్యూ, ఓపీ బ్లాక్, పోస్ట్ నెటల్ వార్డు, ఫార్మసీ ల్యాబ్, ప్రసూతి విభాగంను ప్రారంభించారు. అనంతరం రూ.77.20 కోట్లతో కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు ఉన్న రెండు వరుసల రహదారిని నాలుగు వరుసల రహదారిగా (ప్యాకేజీ -2) మార్చేందుకు శంకుస్థాపన చేశారు. అనంతరం బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. హుస్నాబాద్లో హాస్పిటల్, ఇంజనీరింగ్ కాలేజీ, గౌరవెల్లి ప్రాజెక్ట్ మాత్రమే కాదు.. ఇక్కడి ప్రజలడిగిన పనులన్నీ మూడేండ్లలో పూర్తి అవుతాయని భరోసా ఇచ్చారు. అధికారం కోల్పోయిన వారు తమను విమర్శిస్తే అర్థం లేదని, వారి లాగా ఆకాశంలో హర్మ్యాలు కట్టి అరచేతిలో స్వర్గం చూపెట్టడం లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల బాగుకోసం రైతులకు నష్టం చేయడం దారుణమన్నారు. తెలంగాణ లోనే అత్యాధునిక టెక్నాలజీతో ఎక్కువ కెపాసిటీతో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఆగస్టు రెండో వారం లోపు ప్రారంభించనున్నట్టు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. శాతవాహన యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజీలో ఈ సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం అవుతున్నాయ న్నారు. అక్కన్నపేట నుంచి జనగాం వరకు నాలుగు లైన్ల రోడ్డు త్వరలోనే వస్తుందని, అలాగే ఎల్లమ్మ చెరువు అభివద్ధి, ఇంజినీరింగ్ కాలేజీ, టూరిజ్ ప్రాజెక్టులు ఇలా ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. మెడికల్ కాలేజీతో పాటు 150 పడకల ఆస్పత్రినీ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఎంజీబీఎస్ విద్యార్థులు ఇక్కడ పీజీ చదువుకునే విధంగా 50 పీజీ సీట్లు కూడా ప్రకటించారని తెలిపారు.
అనంతరం మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజ నర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సందర్శించి పనుల పురోగతిపై ఆయిల్ ఫెడ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయిల్ పామ్ రిఫైనరీ ప్యాకింగ్కి టెండర్ పిలిచి పనులు ప్రారంభం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో మాన కొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ హేమావతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఆయిల్ ఫెడ్ అధికారులు, హార్టికల్చర్ అధికారులు, గ్రంథాలయ చైర్మెన్, మార్కెట్ కమిటీ చైర్మెన్లు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
నర్మెటలో తొలి రిఫైనరీ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES